వైశాల్యం పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ లో కొత్త కేబినెట్ కొలువుతీరింది. మొత్తం 15 మంది మంత్రులుగా అవకాశం దక్కగా, 11 మందికి కేబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రి హోదా లభించింది. జైపూర్ లోని రాజ్ భవన్ ప్రాంగణంలో ఆదివారం నాడు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కొత్త మంత్రులతో ప్రమాణాలు చేయించారు. పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, కీలక నేత సచిన్ పైలట్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
మరో రెండేళ్లలో(2023లో) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళిత, గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, అదే సమయంలో సచిన్ పైలట్ వర్గానికీ పెద్దపేట వేస్తూ సీఎం గెహ్లోత్ మంత్రివర్గ కూర్పు చేశారు. కొత్తగా ప్రమాణాలు చేసిన మంత్రుల్లో ఐదుగురు సచిన్ పైలట్ వర్గీయులే కావడం గమనార్హం. అందులో రమేశ్ మీనా, విశ్వేంద్ర సింగ్ లు గతంలోనూ మంత్రులుగా ఉండి, సంక్షోభ సమయంలో పైలట్ కు మద్దతుగా పదవులు వదులుకున్నారు. ఇప్పుడా ఇద్దరితోపాటు సచిన్ వర్గంలో కీలక నేతలైన బ్రిజేంద్ర సింగ్ ఓలా, హేమారామ్ చౌదరి, మురారీలాల్ మీనాలకు కూడా మంత్రి పదవులు దక్కాయి.
మొన్నటిదాకా సహాయ మంత్రులుగా పనిచేసిన మమతా భూపేష్, భజన్ లాల్ జాటవ్, టికారామ్ జూలిలకు ప్రమోషన్ కల్పిస్తూ కేబినెట్ ర్యాంకు కల్పించారు. సచిన్ వర్గంలోని రమేశ్ మీనా, విశ్వేంద్ర సింగ్, హేమారామ్ చౌదరి తోపాటు మహేంద్రజీత్ సింగ్ మాలవియ, రామ్ లాల్ జాట్, మహేశ్ జోషి, గోవింద్ రామ్ మేఘావాల్, శకుంతల రావత్ లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక, బ్రిజేంద్ర సింగ్ ఓలా, జహీదా, రాజేంద్ర గుధా, మురారీలాల్ మీనాలు సహాయ మంత్రులుగా ప్రమాణాలు చేశారు. వీరిలో అధికులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం.
కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం గెహ్లోత్ మాట్లాడుతూ.. పదవులు పొందినవారితో సమానంగా పదవులు లేనివారికీ ప్రాధాన్యం ఉంటుందని, కేబినెట్ లో ఇంకా ఖాళీలు ఉన్నందున కష్టపడి పనిచేసేవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లూ ప్రతిఒక్కరూ చమటోడిస్తే 2023లోనూ రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటం ఖాయమని గెహ్లోత్ అన్నారు. ప్రమాణస్వీకారాకు ముందు పీసీపీ కార్యాలయంలో ఆయనీ కామెంట్లు చేశారు.
కేబినెట్ కూర్పుపై సచిన్ పైలట్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. 16 నెలల కిందట ఏవైతే కారణాలతో తాను సీఎం గెహ్లోత్ తో విభేదించానో అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయని, దళితులు, ఎస్టీలకు ప్రాధాన్యం దక్కాలన్న తన డిమాండ్ కు హైకమాండ్, సీఎం అంగీకారం తెలిపారని, ఈ మార్పులతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైందని, 2023 ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని సచిన్ పైలట్ అన్నారు. మొత్తం 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీకి 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok gehlot, Cabinet Reshuffle, Congress, Rajasthan, Sachin Pilot