రివ్యూ : వీరసింహారెడ్డి (Veera Simha Reddy)
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్, రవి శంకర్, మురళీ శర్మ అజయ్ ఘోష్,లాల్ తదితరులు..
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: రిషీ పంజాబీ
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నెనీ, వై.రవి శంకర్)
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేది : 12/1/2023
Veera Simha Reddy Movie Review: నందమూరి నట సింహా బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శృతి హాసన్ కథానాయికగా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్యపాత్రలో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో బాలయ్య మరోసారి సంక్రాంతి హీరోగా సక్సెస్ అందుకున్నారా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
వీరసింహారెడ్డి (నందమూరి బాలకృష్ణ) రాయలసీమ పులిచర్ల ప్రజలకు దేవుడు. ఆ ఊరికి ఏ కష్టమొచ్చిన ముందుటాడు. అతనికో సవతి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) సొంత కూతురు కంటే ఎక్కువగా లాలించి పెంచుతాడు. ఐతే.. ఒక సంఘటన నేపథ్యంలో చెల్లెలు భానుమతికి అన్నయ్య వీరసింహారెడ్డి అంటే కసి, కోపం, కక్ష పెంచుకుంటుంది. అతన్ని చంపుతానని పంతం పడుతోంది. అన్న ప్రత్యర్ధి మొసళి మడుగు ప్రతాప్ రెడ్డిని (దునియా విజయ్) పెళ్లి చేసుకుంటుంది. అతని భర్తతో తన అన్న వీరసింహారెడ్డిని చంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అసలు భానుమతికి, వాళ్ల అన్న వీరసింహారెడ్డిపై ఎందుకు కక్ష పెంచుకుంది. తన అన్నను చంపాలనుకునే చెల్లెలు ప్రయత్నం ఫలించిందా.. ? చివరకు అన్నా చెల్లెలు ఒకటయ్యారా. మధ్యలో వీరసింహారెడ్డి కుమారుడు జయ సింహారెడ్డి పాత్ర ఏంటి అనేదే ‘వీరసింహారెడ్డి’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు గోపీచంద్ మలినేని నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా అనగానే.. ఆయన యాక్ట్ చేసిన పాత ఫ్యాక్షన్ సినిమాలను తిరగేసి ‘వీరసింహారెడ్డి’ వండి వార్చాడు. బాలయ్యకు ఎలాంటి పాత్ర అయితే సూట్ అవుతుందో పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని.. దాని చుట్టే సన్నివేశాలు అల్లుకున్నాడు. మొత్తంగా బాలయ్య అభిమానులు ఏదైతే ఆశిస్తారో అవన్ని ఈ సినిమాలో పుష్కలంగా అనేకంటే అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాలో బాలయ్య ప్రత్యర్ధులతో తలపడే ప్రతి సీన్స్లో ఎలివేషన్ ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా హీరో విలన్తో నువ్వు సవాల విసరకు.. నేను శవాలు విసురుతా.. అంటూ చెప్పే డైలాగులతో పాటు వీలైన ప్రతి చోట ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేసాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయించిన ఊచకోతకు అంతే ఉండదు.. మొత్తంగా హీరోతో సెంచరీకి పైగా మనుషులను నరికించాడు. ఒక మాములు వ్యక్తి ఇంట్లో భార్యను తిట్టినా .. పోలీసులు కేసులు పెట్టే ఈ రోజుల్లో.. హీరోతో పాటు విలన్ కూడా అవలీలాగా ఎంత మందిని ఎవరిపై ఎలాంటి పోలీసు కేసులు ఉండవు. ఫ్యాక్షన్ సినిమాలు కాబట్టి లాజిక్ అడక్కకూడదు. మొత్తంగా బాలయ్యను వీరసింహారెడ్డిగా కాకుండా వీరహింసారెడ్డిగాచూపించాడు.
ఐతే.. మాస్ ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్, యాక్షన్ సీన్స్ ఫుష్కలంగా ఉండటంతో ఈ సంక్రాంతికి బీ,సీ సెంటర్స్లో ఈ సినిమా ఆడే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మిస్సైనట్టు కనబడింది. స్టార్టింగ్లో శృతి హాసన్, బ్రహ్మానంద్, అలీ కామెడీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. కానీ సినిమా మొత్తాన్ని యాక్షన్ + ఫ్యాక్షన్ + ఎమోషన్+ ఎలివేషన్ అన్నట్టు సాగిపోతుంది. మొత్తంగా ప్రీ క్లైమాక్స్లో వరలక్ష్మి శరత్ కుమార్తో చేయించిన సీన్ సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ క్యారీ అయింది. మొత్తంగా గోపీచంద్ మలినేని కొత్త కథతో కాకుండా.. ఇప్పటికే హిట్టైయిన సినిమాల సీన్స్ను పేర్చుకుంటూ సగటు ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అది అందించడంలో సక్సెస్ అయ్యడనే చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య, వరలక్ష్మి, దునియా విజయ్ పాత్రల చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. ఇక బాలయ్య విగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. ఇక బాలయ్యను బోయపాటి తర్వాత ఈ రేంజ్లో మాస్గా చూపించిన డైరెక్టర్గా గోపీచంద్ మలినేని మంచి మార్కులే కొట్టేసాడు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. మిగతా విభాగాల విషయానికొస్తే.. తమన్ మరోసారి సౌండ్ బాక్సులు పగిలే పోయే ఆర్ఆర్ ఇచ్చాడు. ఈ సినిమాకు తమన్ ప్రాణం పెట్టాడు. రిషీ పంజాబ్ ఫోటోగ్రఫీ గ్రాండియర్గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తికి మరింత పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్టింగ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. వీరసింహారెడ్డి పాత్రలో ఆయన తప్పించి మరొకరిని ఊహించుకోవడం కష్టం. ఇలాంటి ఫ్యాక్షన్, యాక్షన్ పాత్రలు బాలయ్యకు కొట్టినపిండే. మరోసారి వీరసింహారెడ్డిగా నట విశ్వరూపం చూపించాడు. వీరసింహారెడ్డి ప్రతి సీన్లో తనదైన మార్క్ చూపించాడు. అభిమానులు ఏదైతే ఆయన నుంచి ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇక బాలయ్య తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్.. వరలక్ష్మి శరత్ కుమార్.. బాలయ్యకు చెల్లెలుగా, మేనత్త పాత్రలో ఆమె నటన సినిమాకు పెద్ద ఎస్సెట్. హీరో తర్వాత సినిమా మొత్తం తన భుజాలపై మోసింది. సినిమా ప్రీ క్లైమాక్స్లో ఆమె నటనతో సినిమాకు పిల్లర్గా నిలిచింది. ఇలాంటి పాత్రలకు వరలక్ష్మి అనేలా తన నటనతో జీవించింది. విలన్గా నటించిన దునియా విజయ్.. తన పాత్రలో క్రూరత్వం కనిపించేలా నటించాడు. ఫ్రెష్గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత దునియా విజయ్కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇక శృతి హాసన్ పాత్ర ఈ సినిమాలో కేవలం రెండు పాటలు, ఒకటి రెండు సీన్స్కే అన్నట్టు ఉంది. ఇక హనీ రోజ్.. బాలయ్య తల్లిగా.. భార్య పాత్రలో ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో నటించిన అజయ్ ఘోష్, మురళీ శర్మ పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ నటన
వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్
యాక్షన్ కమ్ ఎలివేషన్ సీన్స్
ఫోటోగ్రఫీ
తమన్ రీ రికార్డింగ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సెకండాఫ్
లాజిక్ లేని సన్నివేశాలు
మూవీ నిడివి
చివరి మాట: బాలయ్య మార్క్ ఫ్యాక్షన్ కమ్ ఎమోషన్ యాక్షన్ డ్రామా..
రేటింగ్.. 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Balayya, Mythri Movie Makers, NBK, Shruti haasan, Tollywood, Veera Simha Reddy, Veera Simha Reddy Movie Review