కోవిడ్ సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా తక్కువ సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్ను భారత ఫార్మా సంస్థలు తయారు చేసి ప్రభుత్వానికి అందించాయి. రాజకీయ నేతల వ్యతిరేక ప్రచారాల నడుమ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దశల వారీగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కోవిడ్ వ్యాక్సిన్ జర్నీపై ‘హిస్టరీ TV18’ రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ‘ద వయల్’ (The Vial) ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. 60 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
కోవిడ్-19 వ్యాక్సిన్స్ తయారీ, పంపిణీ, ఈ విషయంలో ఎదురైన సవాళ్లు, ప్రతికూలతల నడుమ విజయవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ ఎలా ముందుకు సాగిందనే వివరాలను ‘The Vial’ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. ఇది 2023, మార్చి 24న రాత్రి 8 గంటలకు హిస్టరీ TV18లో ప్రసారం కానుంది.
* డాక్యుమెంటరీ ప్రత్యేకతలు
హిస్టరీ TV18 'ది వయల్' డాక్యుమెంటరీలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ గురించి వివరించారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో స్ట్రెయిన్ను వేరుచేయడం నుంచి దేశంలోని భారీ జనాభా అవసరాలను తీర్చడానికి రికార్డు సమయంలో భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ కోట్ల కొద్దీ వ్యాక్సిన్స్ తయారు చేయడం వరకు.. అన్ని వివరాలను ఇందులో వివరించినట్లు తెలుస్తోంది.
కరోనావైరస్ మహమ్మారిపై భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ వివరిస్తున్నట్లు ట్రైలర్లో ఉంది. భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నారాయణ హృదయాలయ డాక్టర్ దేవి శెట్టి తదితరులు మాట్లాడుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. మారుమూల ప్రాంతాలు, రవాణా సదుపాయం సరిగా లేని ఏరియాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం, హెల్త్ కేర్ వర్కర్స్ చేసిన కృషి, ఇందుకు సంబంధించిన కేస్ స్టడీస్ను 'ది వైల్'లో వివరించారు.
* వారికి నివాళి
ఈ డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మనోజ్ బాజ్పేయి Network18తో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ జర్నీ మన దేశానికి గర్వకారణం. భారతీయులుగా మనమందరం దీని గురించి తెలుసుకోవాలి, గర్వపడాలి. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తక్కువ సమయంలో వ్యాక్సిన్లను తయారు చేసి, వ్యాక్సిన్ డ్రైవ్ అమలు చేసిన మన హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఈ డాక్యుమెంటరీ ఒక నివాళి లాంటిది. ఈ రోజు మనం ఆత్మవిశ్వాసంతో మా ఇళ్ల నుంచి బయటకు రావడానికి కారణం వాళ్లే.’ అని మనోజ్ వివరించారు.
ప్రస్తుతానికి భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువమంది కనీసం ఒక రౌండ్ కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకున్నారు. విభిన్న జాతులు, మతాలు, విశ్వాసాలు ఉన్న మన దేశంలో ఇది చాలా కష్టమైన పని. అలాగే వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్లో భాగంగా భారతదేశం 100 దేశాలకు 232.43 మిలియన్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించి ప్రపంచానికి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, History, National News, Pm modi