కండెక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ ఇప్పుడు కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నసూపర్స్టార్. అయితే ఈ జర్నీలో ప్రారంభ దశలో జరిగిన కొన్ని విషయాలను ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేదు. కానీ అభిమానులతో వేదికపై పంచుకున్నాడు. తనను తమిళ ప్రజలు నమ్మడం అనేది ఎక్కడ ప్రారంభమైందనే ఆసక్తికరమైన విషయాన్ని తలైవా చెప్పారు. అసలు తాను మద్రాస్ ఎలా వచ్చింది. వచ్చే సమయంలో తనకు ఎదురైన సమస్య ఏంటి? అప్పుడు చెన్నై సెంట్రల్లోని రైల్వే స్టేషన్ టిక్కెట్ కలెక్టర్ని, సాయంగా నిలబడ్డ రైల్వే కూలీల గురించి రజనీకాంత్ ఆర్ద్రతతో చెప్పాడు. అది ఆయన మాటల్లో ఎలా చెప్పారంటే.. "నేను నటుడిని కావాలనుకున్నప్పుడు నా స్నేహితుడు నన్ను మద్రాసు వెళ్లడానికి టిక్కెట్ కొని రైలు ఎక్కించాడు. కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రైలు పొద్దున చెన్నైస్టేషన్కు చేరింది. బయటకు వస్తున్నాను. టిక్కెట్ కలెక్టర్ అందరి దగ్గర టిక్కెట్స్ చెక్ చేస్తున్నాడు. నన్ను అడిగాడు. నేను టిక్కెట్ ఉందా? చూసుకున్నాను. అప్పుడే నాకు తెలిసింది. ఎవడో నా పర్సు కొట్టేశాడని, అందులో రైలు టిక్కెట్ కూడా ఉంది. టిక్కెట్ కలెక్టర్కు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆయన పక్కనే నిశ్శబ్దంగా నిలుచున్నాను. ప్రయాణీలకుందరి టిక్కెట్స్ చెక్ చేసిన తర్వాత.. అందరూ వెళ్లిపోయాక ఆయన నా వైపు చూశారు.
'సార్..నేను నిజంగానే టిక్కెట్ కొన్నాను. కానీ ఎవరో నా పర్సు కొట్టేశారు.. నన్నను నమ్మండి సార్' అని టిక్కెట్ కలెక్టర్తో అన్నాను. ఆయన ముందు నా మాట వినలేదు. టిక్కెట్ లేదు కాబట్టి నువ్వు జరిమానా కట్టాల్సిందేనని అన్నారు. లేదంటే జైలుకెళ్లాల్సిందేనని అన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆయన్ని బతిమాలాడసాగాను. అక్కడే ఉన్న రైల్వే కూలీలు కొందరు నా పరిస్థితి చూశారు. వారికి జాలి కలిగిందేమో. అక్కడకి వచ్చారు. జరిగింది తెలుసుకున్నారు. 'సార్.. ఆ పిల్లాడు చెప్పేది వింటుంటే అబద్దం చెప్పలేదనిపిస్తుందండి' అని కూలీలు అన్నారు. కానీ టిక్కెట్ కలెక్టర్ వినలేదు. చివరకు వాళ్లు ఏమనుకున్నారో ఏమో కానీ.. ' సార్.. పోనివ్వండి.. ఫైన్ ఎంతయ్యిందో చెప్పండి. ఆ పిల్లాడి బదులుగా మేమే కట్టేస్టాం' అన్నారు. ఆ మాటలు వినగానే ఆ టిక్కెట్ కలెక్టర్ ఏమనుకున్నారో ఏమో కానీ 'సరే! నేను నిన్ను నమ్ముతున్నాను.. వెళ్లు' అన్నారు. ఆయనకు, రైల్వే కూలీలకు దణ్ణం పెట్టి ముందుకు కదిలాను. వాళ్లు నన్ను చూస్తున్నారు. నేను అడుగులు వేస్తూ బయటకు వచ్చాను. నేను ఆ సన్నివేశాన్ని మరచిపోలేను. అలా తమిళ ప్రజలు నన్ను ఆరోజునే నమ్మారు. వారి ప్రేమ, ఆప్యాయతను నాపై చూపించారు. అందుకే నేనీస్థాయిలో ఉన్నాను'' అంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను తెలియజేశారు సూపర్స్టార్ రజినీకాంత్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajni kanth, Telangana Politics