news18-telugu
Updated: December 2, 2020, 8:32 AM IST
రానా Photo : Twitter
రానా దగ్గుబాటి.. ప్రఖ్యాత తెలుగు సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు విలన్గాను అలరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలను.. పోషిస్తున్నాడు. అందులో భాగంగా విరాటపర్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. నక్సల్ బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కుతోన్న ఈ విరాట పర్వం సినిమానను.. ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్గా ఉంటాయని టాక్. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని అదే ఈ సినిమాలో కొత్తగా ఉండనుందని సమాచారం. మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే ఈ విరాట పర్వం అని అంటున్నారు. దీనికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.
అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా కరోనా కారణంగా ఆ మధ్య వాయిదా పడగా.. తాజాగా షూటింగ్ను పున: ప్రారంభించింది చిత్రబృందం. అందులో భాగంగా ప్రస్తుతం రాత్రి వేళల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ''ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మిగతా సన్నివేశాల చిత్రీకరణను ఇటీవలే పునఃప్రారంభించాం. రాత్రి వేళల్లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ షెడ్యూల్లో రానా కూడా పాల్గొంటున్నారు. విభిన్నంగా, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపిస్తారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు'' అని చెప్పాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్బాబు సమర్పకులు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

విరాటపర్వంలో సాయి పల్లవి Photo : Twitter
ఇక రానా ప్రస్తుతం చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. 'గృహం' ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వంలో నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడట. మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనుంది చిత్రబృందం. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేస్తున్న మిలింద్ రావ్ తన తర్వాత చిత్రాన్ని రానాతో చేయనున్నాడు. ఈ క్రమంలో రానా తో ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నాడు మిలింద్ రావ్. రానా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో ముఖ్యంగా క్షుద్ర పూజలు, చేతబడి గురించి చర్చించనున్నారట. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషలో రూపొందనున్నది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రానా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన మరో ప్యాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. 'హాథీ మేరే సాథీ' పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రానా చాలా కొత్తగా కనబడనున్నాడు . హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలతోపాటు రానా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే ఓ సినిమా చేయనున్నాడు. ఓ వెబ్ సిరీస్కు కూడా ఓకే చెప్పాడు రానా. కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్, రానా దగ్గుబాటితో కలిసి వెబ్ సిరీస్లో నటించనున్నారు. నెట్ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం అందుతోంది. వెబ్సిరీస్ను మొదటి తెలుగు భాషలో చిత్రీకరించి ఆ తర్వాత బహుళ భాషల్లో విడుదల చేస్తారట.
Published by:
Suresh Rachamalla
First published:
December 2, 2020, 8:32 AM IST