'ఇస్మార్ట్ శంకర్' థియేటర్లలో ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు యూ ట్యూబ్లో కూడా అంతే రచ్చ చేస్తుంది. పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయింది. మాస్ ఆడియన్స్ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
సినిమా మాదిరే ఇప్పుడు విడుదలైన వీడియో సాంగ్స్ కూడా రచ్చ చేస్తున్నాయి. వారం రోజుల కింద యూ ట్యూబ్లో విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ అప్పుడే 2 కోట్ల వ్యూస్ అందుకుంది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్లో సంచలనాలు రేపుతుంది దిమాక్ ఖరాబ్ సాంగ్. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశాడు. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ తన తర్వాతి సినిమా చేస్తున్నాడు. మరోవైపు రామ్ మాత్రం ఇంకా కథల వేటలోనే ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.