నిర్మాత నట్టికుమార్ తనపై చేసిన ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. నట్టి కుమార్ ఇచ్చిన నోటీసులకు తన లాయర్ సమాధానం ఇస్తామన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసని అన్నారు. ఇండస్ట్రీలో ఎవరిమీదో ఒకరి మీద ఆరోపణలు చేయడం నట్టి కుమార్కు అలవాటే అన్నారు. గతంలో చిరంజీవి, సురేశ్బాబు మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని అన్నారు. నట్టి కుమార్ ఎలాంటి వాడో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని అన్నారు వర్మ. తన కొడుకు, కుమార్తెతో తీసిన సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేయలేదని, రావల్సిన కమీషన్ రాలేదని కొందరిని ఆయన దూషించాడని వర్మ అన్నారు.
తన సినిమా ‘మా ఇష్టం’ విడుదల వాయిదాకు నట్టికుమార్ కారణం కాదని, వేరే కారణం ఉందన్నారు. లెస్బియన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు చాలా థియేటర్లు ముందుకు రావడం లేదని వర్మ ఆరోపించారు. దీనిపై లీగల్గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు వర్మ. నట్టి కుమార్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కాబట్టి ఆయన గురించి ఇకపై ఎక్కడా మాట్లాడనని పేర్కొన్నారు. చట్ట పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని తన అడ్వకేట్ చూసుకుంటారని ఆర్జీవీ వివరించారు.
అయితే వర్మపై నట్టి కుమార్ కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వర్మ గతంలో తీసిన చిత్రాలకు తన స్నేహితులతో కలిసి తాను ఫైనాన్స్ చేశానని, అందుకు సంబంధించి తనకు ఇంకా రూ. 5.29 కోట్లు రావాల్సి ఉండగా, ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించారు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలనే ఒప్పందం తమ మధ్య ఉందని, కానీ ఆయన దానిని ఉల్లంఘించారని నట్టి కుమార్ ఆరోపించారు. ఒప్పందం ప్రకారం తను డబ్బులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. పిటిషన్ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీస్తున్న కొత్త సినిమా విడుదలకు బ్రేక్ వేసింది కోర్టు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.