నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు(NTR). శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ.. వారి రూపాల్లో మనందరినీ అలరించి మనకు దేవుడయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. సినిమాల్లో అయిన రాజకీయాల్లో ఆయనకు ఆయనే సాటి. తెలుగు ప్రజలెవరూ ఆ మహానుభావుడ్ని మరిచిపోలేరు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారిదే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఆయనదే. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే.
మే 28న ఎన్టీఆర్ జయంతి. అయితే ఈ ఏడాదితో ఎన్టీఆర్(NTR Birth Anniversary) వందో జయంతి అవుతోంది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు,నందమూరి హీరో... బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది నందమూరి తారక రామారావు జయంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీయార్ ఘాట్కు(Ntr Ghat) వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే ఈ ఏడాది వందో జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) అభిమానులకు ఓ లేఖను విడుదల చేశారు.
[gallery ids="1307372"]
‘మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది…’అని పేర్కొన్నారు.
‘మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు.. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను.. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నాను.. 365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను..’ అంటూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Nandamuri balakrishna, NTR