దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళలో కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సైతం వైరస్ బారినపడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్, రాజేంద్రప్రసాద్ ఇలా చాలా మందికి కరోనా సోకింది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, మాజీ భార్య రేణు దేశాయ్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్, అన్ని ఇండస్ట్రీల్లోనూ అభిమానులున్న సినీ దిగ్గజం మమ్ముట్టిని కూడా కరోనా కాటేసింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆదివారం వెల్లడించారు.
గత కొన్ని నెలలుగా మమ్ముట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘‘సీబీఐ 5’’ సినిమా షూటింగ్ చేస్తుండగానే కోవిడ్ సోకినట్టు మాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రస్తుతం హీరో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. కరోనా సోకిందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో అతడు ఒక మెసేజ్ను పోస్ట్ చేశారు.
‘అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నాకు జనవరి 15న కోవిడ్ సోకింది. నా ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికి కొద్దిపాటి జ్వరం మాత్రం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నా ఇంటిలో ఐసోలేషన్లో ఉన్నాను. మీరుందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడు మాస్క్ను తప్పక ధరించండి’అని మమ్ముట్టి చెప్పారు.
గతంలో తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసిన మమ్ముట్టి.. వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం మలయాళంలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన ఆయన.. అఖిల్ నటిస్తోన్న 'ఏజెంట్' సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.