తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. అందులో వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. అంతేకాదు హైదరాబాద్లోని ‘ఓడియన్ 70 MM’ థియేటర్లో ఏకధాటిగా ఒక యేడాది పాటు నాల్గోషోలతో రఫ్పాడించింది. ఈ సినిమాలో జగదేకవీరుడుగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె అతిలోకసుందరి ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరోకరిని ఊహించుకోలేము. ఈ సినిమా మే 9తో 30 ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత అశ్వనీదత్తో పాటు చిరంజీవి కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగుట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూలోకానికి వస్తోంది. ఇది నిర్మాత అశ్వనీదత్కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్లో రెడీ చేసి కే.రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు. ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాయడం విశేషం. హిందీలో ఈ చిత్రాన్ని ‘ఆద్మీ ఔర్ అప్సర’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇక ప్రేక్షకుల్లో చిరంజీవి,శ్రీదేవి అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టు సీన్స్ ఉండాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు కలిసే ఫస్ట్ సీన్ పై ఎన్నో తర్జన భర్జనలు పడింది చిత్ర యూనిట్. సినిమాలో మాత్రం వీళ్లిద్దరు మానస సరోవరంలో కలుసుకున్నట్టు చూపించారు. ఐతే.. మొదట అనుకున్న స్టోరీ ప్రకారం.. ‘గాయపడిన పాపకు చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయి. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్త చంద్రుడి పైకి ఒక మిషన్ నిర్వహించాలనుకుంటోంది.
స్పేస్ షిప్లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్లలో డబ్బులు ఇస్తామని చెబుతుంది. ఈ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్ షిప్లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగోట్టుకుంటోంది. అది చిరుకు దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమి మీదికి వస్తుంది. ఇది పూర్తి కథ రెడీ కాకముందు అనుకున్న కథ.
ఐతే.. చంద్రుడు, స్పేస్ షిప్ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్ భావించిందట. దీనిపై చర్చ నడుస్తుండగా.. చిరంజీవి ‘మానస సరోవరం’ బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పడంతో .. అందరికీ అది నచ్చింది. అంతేకాదు కథను ఆ దిశగా రెడీ చేసారు రచయతలు. అలా చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం.. అక్కడ విహారించడానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగోట్టుకోవడం..దాని కోసం కథానాయిక భూమి మీదికి రావడాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Chiranjeevi, Ilaiyaraaja, K. Raghavendra Rao, Sridevi, Tollywood