అతడు కనిపిస్తే ప్రభంజనం.. స్క్రీన్పై మెరిస్తే అరాచకం.. డాన్సులు వేస్తే అభిమానుల ఒంట్లో కరెంట్ ప్రవాహం.. డైలాగులు చెబుతుంటే ఉప్పొంగే ఆనందం.. స్టైల్గా చూస్తే రికార్డుల కోలాహలం.. ఇలా ఒక్కటేంటి.. అతడేం చేసినా అభిమానులకు అదో పండగే. ఇంతటి స్టార్ ఇమేజ్ ఎవరికైనా ఉంటుందా అసలు అనేంతగా క్రేజ్. ఇవన్నీ ఒకేఒక్క స్టార్కు సొంతం. అతడి పేరు చిరంజీవి.. కాదు కాదు మెగాస్టార్, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
1970వ దశకంలో చెన్నైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో మొదలైన ఈయన ప్రయాణం ఇప్పటికీ సాగుతూనే ఉంది. దిగ్విజయంగా.. అనిర్వచనీయంగా అనితర సాధ్యంగా ఇప్పటికీ నిర్విరామంగా చిరంజీవి నట ప్రస్థానం సాగుతూనే ఉంది. సెప్టెంబర్ 22, 2018తో ఈయన ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుని.. 41వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాడు. ఈయన నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22, 1978లో విడుదలైంది. పునాదిరాళ్లు ముందు మొదలుపెట్టినా విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు సినిమానే. కే వాసు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
సుప్రీమ్ హీరోగా మొదలై.. మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఈ తరం నటులకు ఆదర్శం. తెలుగు సినిమాకు రెండు కళ్లు ఎన్టీఆర్.. ఏఎన్నార్. మన సినిమా స్థాయిని ప్రపంచ యమనికపై రెపరెపలాడించిన మేటి నటులు. అయితే వీళ్లతో పాటు మూడో కన్ను కూడా ఉంది మన తెలుగు సినిమాకు. ఆ కంటి పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్ ఉరఫ్ చిరంజీవి. మెగాస్టార్ ఆఫ్ తెలుగు సినిమా. అభిమానులు ముద్దుగా అన్నయ్య.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
తెలుగు సినిమాకు రికార్డులు అంటే ఎలా ఉంటాయో చూపించిన మెగా మగధీరుడు చిరంజీవి. 1978లో ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి కెరీర్కు స్టార్గా పునాది రాళ్లు వేసింది మాత్రం "ఖైదీ" సినిమానే. అప్పటివరకు 30 సినిమాలకు పైగానే నటించిన చిరంజీవికి తొలిసారి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది ‘ఖైదీ’. అప్పట్లోనే ఆ సినిమాతో 4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు సుప్రీమ్ హీరో. మాస్ హీరోగా వెలిగిపోతున్న సమయంలో ‘విజేత’ లాంటి డిఫెరెంట్ మూవీతోనే సంచలనం రేపిన ఘనత చిరంజీవి సొంతం.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
80ల్లో చిరు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్కు కొత్త లెక్కలు నేర్పించాయి. "ఛాలెంజ్".. "అభిలాష".. "శుభలేఖ".. "ఖైదీ".. "చంటబ్బాయి".. "దొంగమొగుడు".."యముడికి మొగుడు".. "పసివాడి ప్రాణం".. "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" లాంటి సినిమాలతో సుప్రీమ్ హీరో స్థాయి నుంచి మెగాస్టార్గా ఎదిగాడు చిరంజీవి. "పసివాడి ప్రాణం" 5 కోట్లు.. "యముడికి మొగుడు" 5.2 కోట్లు.. "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" 5.25 కోట్లతో ఇండస్ట్రీ హిట్లు అందకున్నాడు మెగాస్టార్.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
ఇక 90ల్లో మెగాస్టార్ రికార్డులకు అడ్డే లేకుండా పోయింది. "జగదేకవీరుడు అతిలోసుందరి".. "గ్యాంగ్ లీడర్" సినిమాలతో వరసగా రెండేళ్లు ఇండస్ట్రీ రికార్డులు తారుమారు చేసాడు చిరంజీవి. ఇక "ఘరానామొగుడు" తెలుగులో తొలి 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమాగా అవతరించింది. అప్పుడే బిగ్గర్ ద్యాన్ బచ్చన్ అంటూ చిరంజీవిపై ది వీక్ అనే మ్యాగజైన్ వేసిన ఆర్టికల్ అప్పట్లో సంచలనం అయింది. "ఘరానా మొగుడు" తర్వాత కొన్నేళ్లు "బిగ్ బాస్", "ముగ్గురు మొనగాళ్లు", "రిక్షావోడు" అంటూ కొన్ని ప్లాపులు వచ్చినా కూడా "హిట్లర్"తో కమ్బ్యాక్ ఇచ్చాడు చిరు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

చిరంజీవి 41 ఇయర్స్ జర్నీ
మిలీనియం మొదట్లోనే "అన్నయ్య"తో హిట్ అందుకుని.. "ఇంద్ర"తో తొలిసారి 30 కోట్ల క్లబ్లోకి తెలుగు సినిమాను తీసుకెళ్లాడు చిరంజీవి. "ఠాగూర్", "శంకర్దాదా ఎంబిబిఎస్"తో వరస విజయాలు అందుకున్నాడు. "స్టాలిన్', 'జై చిరంజీవ", "శంకర్దాదా జిందాబాద్" లాంటి సినిమాలు అంచనాలు అందుకోకపోయినా.. పదేళ్ల తర్వాత వచ్చి "ఖైదీ నెం.150"తో పదేళ్లుగా ఏ హీరో సాధించలేని విధంగా 100 కోట్ల షేర్ మార్క్ను అందుకున్నాడు చిరంజీవి.

చిరు చరణ్ ఫేస్బుక్ ఫోటో
దశాబ్ధం గ్యాప్ ఇచ్చినా కూడా పవన్, మహేశ్, ఎన్టీఆర్ ఇలా ఎవరివల్లా కాని 100 కోట్ల మార్క్ (బాహుబలి కాకుండా) చిరంజీవి పదేళ్ల తర్వాత వచ్చి అందుకున్నాడు. అది అన్నయ్య స్టామినా. ఇప్పుడు "సైరా నరసింహారెడ్డి" అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

సైరా మూవీలో చిరంజీవి
ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు యూరప్ దేశాల్లో జరుగుతుంది. అక్కడే జార్జియాలో షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ 200 కోట్లతో సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2019 మేలో విడుదల కానుంది ఈ చిత్రం. చిరంజీవి ప్రస్థానం 41 కాదు.. ఇలాగే కలకాలం సాగాలని అభిమానుల ఆశ. అది సాగాలని కోరుకుందాం కూడా.