Jamuna- NTR- ANR: జమున తెలుగు సినిమాల్లో వగరు, పొగరు, భక్తి, ఇలా నవరసారాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు. వెండితెరపై నే కాదు.. నిజ జీవితంలో అది సినీ ఇండస్ట్రీలో NTR, ANR వంటి హీరోలకు సైతం తలవంచని మనస్తత్వం ఆమెది. అందుకే ఈ దిగ్గజ హీరోలతో ఈమె ఢీ అంటే ఢీ అంటూ కథానాయికగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వెండితెరపై అందం, అభినయం రెండూ కలిసి ఉన్న అలనాటి హీరోయిన్లలో జమున పేరు కచ్చితంగా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జమున.. ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆమె నటించిన కొన్ని చిత్రాల్లోని పాత్రలు ఆమె కోసమే పుట్టాయేమో అన్నంతగా ఉండేవి.
అలాంటి జమున.. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్లను బాయ్కాట్ చేసింది. వారితో పనిచేయనని అప్పట్లో తెగేసి చెప్పేసింది. ఇలా దాదాపుగా మూడేళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి నటించని ఈ నటి.. అపుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అప్ కమింగ్ హీరోలైన కృష్ణ,శోభన్ బాబు, హరనాథ్, కృష్ణంరాజు సరసన నటించిన మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇక మూడేళ్ల గ్యాప్ తరువాత గుండమ్మ కథ కోసం మళ్లీ ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి నటించారు జమున. అప్పట్లో నందమూరి, అక్కినేని హీరోలను ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చిందో ఈమె పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. అప్పటి తెలుగులో సూపర్ స్టార్స్గా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓ వెలుగు వెలుగుతున్నారు. వాళ్లతో నటించకపోవడం అంటే ఎంతో గట్స్ ఉండాలి. ఇక ఏఎన్నార్తో వివాదంపై మాట్లాడుతూ.. నాగేశ్వర రావుకు ఏంటంటే అందరూ తనకు వొంగి వొంగి దండాలు పెట్టాలి. నేను అలాంటి టైప్ కాదు ఏ ఫీల్డ్లోనైనా కారెక్టర్, సెల్ఫ్ రెస్పెక్ట్ అది మెయింటెన్ చేసుకోవాలి అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అలా నాగేశ్వర రావు, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పద్మశ్రీలాగా నాకు చాలా టైటిల్స్ ఇచ్చారు. పొగరుబోతుది, కాలు మీద కాలు వేసుకుంటుంది, సమయానికి రాదు, ఆలస్యంగా వచ్చినా సారీ చెప్పదు.. ఇలా చాలా రకాలుగా తనకు పేర్లు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే బాయ్కాట్ చేశాను. ఆ తరువాత నేను హరినాథ్, జగ్గయ్య, రమణమూర్తి, కృష్ణ, శోభన్ బాబు ఇలా కొత్త కొత్త హీరోల పక్కన చేశాను. హరినాథ్, జగ్గయ్యతో నాకు మంచి పేరు వచ్చింది. ఇక గుండమ్మ కథ సినిమా కోసం చక్రపాణి, నాగిరెడ్డి.. నన్ను, నాగేశ్వర రావు, ఎన్టీఆర్లను పిలిచి కాంప్రమైజ్ చేశారు అని జమున చెప్పుకొచ్చారు. దాంతో ఆ వివాదం ముగిసింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ తను తీస్తోన్న ‘గులేబకావళి కథ’ లో తనను కథానాయికగా తీసుకున్నారు. అటు ఏఎన్నార్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్లో హీరోయిన్గా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఎన్టీఆర్ 70వ దశకం చివర్లో చేసిన ‘శ్రీరామ పట్టాభిషేకం’లో ‘మనుషులంతా ఒక్కటే’, ‘సంసారం, ధనమా దైవమా వంటి చిత్రాల్లో నందమూరి సరసన మెరిసింది జమున. మొత్తంగా పురుషాధిక్య సినీ ప్రపంచంలో ఓ కథానాయికగా ఎలా ఉండాలో జమున చూపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.