ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు వుండడు, సినిమా ప్రేమికుడు వుండడు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. 1970కి ముందు శ్రోతలు మధురమైన సంగీతాన్ని విన్నారు. 1970 ఎంటర్ అయిన తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. మధురం స్థానంలో కొంత మాస్ మసాలా కూడా తోడైంది. కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాటల ప్రాధాన్యత పెరిగింది. 1970 తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైమ్లోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు స్లో పాయిజన్లా ఎక్కించడం మొదలు పెట్టాడు.
చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లాలో పన్నియపురంలో జన్మించాడు. గ్రామీణ ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. స్కూల్ లో చేర్పించేటప్పుడు జ్ఞానదేశికన్ పేరుని ఆయన తండ్రి రాజయ్య గా మార్పించారు. సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును రాజా గా మార్చారు. 1976 లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటిసినిమా ’అన్నకిలి’ చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ’ఇళయ’ (అంటే చిన్నవాడు అని తమిళ్ లో అర్థం) అని పిలిచేవాడు. ఆరోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండుపదాలని కలిపి ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు.
మాస్ పాటైనా, మెలోడీ సాంగ్ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్ని లింక్ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు. 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఎ.ఆర్.రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గీతాంజలి’ పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. కమల్హాసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్లో మైల్స్టోన్స్గా చెప్పుకోవచ్చు.
తన 40 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి ’సింఫనీ’ ని కంపోజ్ చేసారు. ఆసియా ఖండం లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన చిత్రపరిశ్రమలో చేసిన సేవలకు గాను 2010 లో భారత ప్రభుత్వం ’పద్మభూషణ్’ ..2018 ప్రధాని మోదీ ప్రభుత్వం పద్మ విభూషణ్తో ఆయన్ని గౌరవించింది.
మొత్తంగా సంగీత దర్శకుడిగా ఐదు జాతీయ అవార్డులు అందుకుంటే.. అందులో తెలుగులో ఈయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’,‘రుద్రవీణ’ సినిమాలకు అవార్డు దక్కడం విశేషం. ఇక మిగిలిన రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్కు జాతీయ అవార్డులు వచ్చాయి, తెలుగులో ‘శ్రీరామ రాజ్యం’, రుద్రమదేవి’ ‘ధోని’ సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతారణి అయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు. ఏది ఏమైనా భారతీయ సినీ సంగీతంలో ఆయనో లెజండ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindi Cinema, Ilaiyaraaja, Kollywood, Tamil Cinema, Telugu Cinema, Tollywood