సినీ నటి , నిర్మాత ఛార్మి కౌర్ని (Charmy Kaur) ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థ (Tollywood Drug Case) ED విచారించనుంది. టాలీవుడ్ డ్రగ్ స్కామ్ కేసులో ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. విచారణ ప్రక్రియలో పాల్గొనడానికి హైదరాబాద్లోని ED కార్యాలయానికి ఈ ఉదయం చేరుకుంది. ఇక ఇటీవల ఇదే కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను ఈడీ ప్రశ్నించించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున (puri jagannadh) దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఈరోజు ఛార్మి ఈడీ ముందుకు వచ్చింది. ఛార్మి తో పాటు విచారణకు చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్గా మారడంతో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు బయటకి వచ్చిన విషయం తెలిసిందే. కెల్విన్ అకౌంట్లో ఛార్మి డబ్బులు వేసిందా లేదా, కెల్విన్తో ఆమెకు పరిచయం ఉందా.. లేదా అనే అంశాలపై ఈడీ అధికారులు విచారణ చేయనున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పూరీ జగన్నాథ్తో పాటు నటుడు రానా దగ్గుబాటి, నటి రకుల్ప్రీత్ సింగ్, నిర్మాత చార్మి, నటుడు రవితేజ, నవ్దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులు ఉన్నారు.
వీరితో పాటు ఈ విచారణకు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా రానున్నారు. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి. పూరి జగన్నాథ్ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్ 2, రకుల్ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8, రవితేజ - సెప్టెంబర్ 9, శ్రీనివాస్ - సెప్టెంబర్ 9, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, నందు - సెప్టెంబర్ 20, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.