news18-telugu
Updated: June 5, 2020, 3:25 PM IST
బాలయ్య, చిరంజీవి (balakrishna chiranjeevi)
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో మరో వివాదం తెరపైకి రాబోతుందా? అయితే, ఈ ఘటనను వారిద్దరూ ఎలా హ్యాండిల్ చేస్తారనే అంశంపైనే ఇది ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి అండ్ టీమ్ భేటీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఈ నెల 9న అమరావతి రావాల్సిందిగా చిరంజీవికి సీఎం జగన్ ఆఫీసు నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి, మరికొందరు నిర్మాతలు అమరావతి వెళ్లాలని నిర్ణయించారు. అయితే, ఈసారి బాలకృష్ణకు కూడా సమాచారం ఇవ్వాలని చిరంజీవి తన అనుయాయుల వద్ద సూచించినట్టు సమాచారం. నిర్మాత సి.కళ్యాణ్ ద్వారా బాలయ్యకు సమాచారం అందించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలకు సంబంధించిన వారే ఈ భేటీకి హాజరుకావాలని చిరు అండ్ టీమ్ నిర్ణయించింది. అందుకే తనకు దగ్గరగా ఉండే ఓ దర్శకుడిని కూడా ఈ సమావేశానికి రావొద్దని చిరంజీవి స్పష్టం చేసినట్టు సమాచారం.
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ సందర్భంగా బాలయ్యను పిలవకపోవడం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. తలసానితో కలసి భూములు పంచుకుంటున్నారంటూ బాలకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కూడా దీటుగానే బదులిచ్చారు. ఇండస్ట్రీలో బాలకృష్ణ ఓ హీరో మాత్రమే అంటూ తీసిపారేసినట్టు మాట్లాడారు. దీంతో సి.కళ్యాణ్ జోక్యం చేసుకుని బాలకృష్ణ ఫేస్ వాల్యూతో పని అవుతుందనుకుంటే ఆయన్ను తీసుకెళతామని, ప్రస్తుతం చిరంజీవి ఫేస్ వాల్యూ పనికొస్తుంది కాబట్టి ఆయన్ను ముందు ఉంచి కథ నడిపిస్తున్నామని చెప్పారు.
ఇప్పుడు చిరంజీవి అండ్ టీమ్ ఏపీ సీఎం జగన్ను కలిసే బృందంలో బాలకృష్ణ ఉంటారా? పిలిచినా వెళ్లకపోతే బాలకృష్ణ మీద విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పిలవకపోతే నిజంగానే నందమూరి హీరోను పక్కనపెట్టారంటూ చిరంజీవి అండ్ టీమ్ మీద వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 5, 2020, 3:22 PM IST