బిగ్ బాస్ హౌస్లో సేఫ్ గేమ్స్కు ఎండ్ కార్డ్ పడింది. హౌస్లో ఎవరు హీరో? ఎవరు జీరో? అంటూ హోస్ట్ నాగార్జున వేసిన ప్రశ్న కంటస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టింది. ప్రధాన కంటెస్టెంట్స్ మధ్య మానసికంగా ఇది పెద్ద గ్యాప్ క్రియేట్ చేసింది. ఐపీఎల్ పోటీని ధీటుగా ఎదుర్కొని బిగ్ బాస్ వైపు ప్రజలు నిలవాలంటే ఆ మాత్రం అగ్గి రాజేయాల్సిన అవసరం ఉందని బిగ్ బాస్ భావించినట్లున్నాడు కాబోలు. హౌస్లో అమ్మ రాజశేఖర్ జీరోగా పేర్కొన్న లాస్య...అందుకు చూపిన కారణాలు చర్చనీయాంశంగా మారాయి. శృతిమించిన కామెడీ చేస్తున్నారన్న లాస్య...అంతటితో ఆగకుండా స్కిట్ కోసం రెడీ అవుతున్న దివి ప్రెగ్నెంట్గా కనిపించేందుకు ఒక పిల్లో పెట్టుకోగా...రాజశేఖర్ మరో పిల్లోను స్వయంగా పెట్టడం సరిగ్గా లేదన్నారు. దివి పట్ల అమ్మ రాజశేఖర్ అలా ప్రవర్తించాల్సింది కాదనడంతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ పిల్లో లొల్లి ఎపిసోడ్ శనివారం బిగ్ బాస్ షోలో హైలైట్గా నిలిచిపోయింది.
అయితే రాజశేఖర్ను జీరో చేయడానికి తన పేరును ప్రస్తావిస్తూ లాస్య చేసిన కామెంట్స్కు అభ్యంతరం చెప్పిన దివి...‘షటప్’ అంటూ లాస్యను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దివి కామెంట్స్ను లాస్య ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. హౌస్లో అడుగుపెట్టిన రెండ్రోజులకే దివి యాటిట్యుడ్ ఎంత మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
అమ్మ రాజశేఖర్, లాస్య బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌస్లో వారిద్దరి మధ్య జరిగిన గొడవపై అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. రాజశేఖర్ పట్ల తన అభిప్రాయాలను లాస్య చాలా స్పష్టంగా...ఎంతో మర్యాదపూర్వకంగా తెలియజేశారంటూ ఆమెను కొందరు నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. రాజశేఖర్ మనస్సు గాయపడినందున లాస్య సారీ కూడా చెప్పిందని...ఆ తర్వాత కూడా ఆయన హౌస్లో అంత రాద్ధాంతం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లాస్య ఎత్తిచూపిన నెగటివ్స్ను పాజిటివ్గా తీసుకోవాల్సిన అమ్మ రాజశేఖర్...ఎమోషనల్ డ్రామా ఆడారని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. తద్వారా రాజశేఖర్ బిగ్ బాస్ ప్రేక్షకుల సానుభూతిపొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. లాస్య కామెంట్స్ పట్ల ఆయన ఓవర్ యాక్షన్ చేశారని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేందుకే లాస్య అలాంటి కామెంట్స్ చేసిందని మండిపడుతున్నారు. రాజశేఖర్ టాస్క్లో ఎక్కడైనా తప్పు చేసి ఉంటే...లాస్య దాన్ని ఎత్తిచూపాల్సిందని అంటున్నారు. అలా కాకుండా దివి పట్ల అతని ప్రవర్తన సరిగ్గా లేదంటూ...బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆయనపై నెలకొన్న సదాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. లాస్య చాలా కన్నింగ్...రాజశేఖర్ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ప్రయత్నించడం ద్వారా ఈ విషయం మరోసారి ఈ విషయం రుజువయ్యిందని కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాజశేఖర్ను హీరోగా పేర్కొన్న దివి...లాస్యకు సరిగ్గా బుద్ధి చెప్పిందని అంటున్నారు.
అటు ఈ ఎపిసోడ్లో లాస్యపై దురుసుగా ప్రవర్తించిన దివిపై కూడా లాస్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. లాస్య పట్ల దివి చాలా రూడ్గా ప్రవర్తించిందని అంటున్నారు. హౌస్లో అందరి అభిప్రాయాలను ప్రభావితం చేసేలా నోయల్, లాస్య మొదటి నుంచీ ప్రవర్తిస్తున్నారని మరికొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ తీరుగా హౌస్లో అందరి ఆటను వారిద్దరే ఆడేస్తున్నారని..ఇది సరికాదంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి మరికొందరు మాత్రం ఐపీఎల్ తొలి మ్యాచ్ చూస్తూ శనివారంనాటి బిగ్ బాస్ ప్రోగ్రామ్ను చూడకపోవడంతో చాలా మిస్ అయ్యామంటూ కామెంట్ చేస్తున్నారు.
అటు కొందరు హోస్ట్ నాగార్జునపై కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఎవరు హీరో? ఎవరు జీరో?అన్న ఒక్క ప్రశ్నతో నాగార్జున నారధుడిలా కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టారని అభిప్రాయపడుతున్నారు. ఈ మంటలు హౌస్లో అంత ఈజీగా ఆరేలా లేవని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu