రిలీజ్ తేదీ | : | 25/11/2022 |
దర్శకుడు | : | A.R. మోహన్ (A.R.Mohan) |
సంగీతం | : | శ్రీ చరణ్ పాకాల |
నటీనటులు | : | అల్లరి నరేష్ ఆనంది, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీ తేజ్,సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు.. .. |
సినిమా శైలి | : | మెసెజ్ ఓరియంటెడ్ అండ్ ఎమోషనల్ డ్రామా |
సినిమా నిడివి | : | 2Hr 30M |
రివ్యూ : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilly Prajaneekam)
నటీనటులు : అల్లరి నరేష్ ఆనంది, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీ తేజ్,సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు..
ఎడిటర్: చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత : S. లక్ష్మణ్ కుమార్, అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకత్వం: A.R. మోహన్
విడుదల తేది : 25/11/2022
అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలను పక్కనపెట్టి కాన్సెస్ట్ ఓరియంటెడ్ మూవీస్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. గతేడాది ‘నాంది’ అంటూ డిఫరెంట్ అటెంప్ట్ చేసిన అల్లరోడు.. ఇపుడు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరి నరేష్ మరో హిట్టు అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రభుత్వ విధుల్లో భాగంగా ఎలక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహించడానికి రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న మారుముల గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి వస్తాడు. ఈ ఊరుకు వెళ్లాలంటే కొన్ని మైళ్ల దూరం ఓ పూట నడిస్తే కానీ చేరుకోలేని పరిస్థితులు ఉంటాయి. సరైన రోడ్డు,పాఠశాల, ఆసుపత్రి వంటి కనీస వసతి సౌకర్యాలు అక్కడ ఉండవు. ఇక్కడ ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ఆ దేవుడిపై భారం వేయాల్సిందే. అక్కడ ప్రజలు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ఎంత మొరపెట్టుకున్న కనీస సౌకర్యాలు కల్పించరు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్లిన శ్రీనివాస్ (అల్లరి నరేష్) వారిని ఎన్నికల్లో ఓటు వేయడానికి అక్కడి ప్రజలను ఒప్పించాడా ? ఓ ప్రభుత్వ అధికారికి వాళ్ల ఊరికి కనీస సౌకర్యానాలు కల్పించడంలో సాయం చేసాడా .. ? ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉద్యోగిగా శ్రీనివాస్ ఎలాంటి గడ్డు పరిస్థితులును ఎదుర్కొన్నాడనేదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు ఏ.ఆర్. మోహన్ తాను అనుకన్న కథను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించాడు. అక్కడక్కడ సినిమాటిక్గా కనిపించినా.. ఓవరాల్గా టెక్నాలజీ పుణ్యామా నగరాలు, పట్టణాలు అభివృద్ది చెందుతుంటే.. కొన్ని మారుముల ప్రాంతాలకు కనీస వసతి సౌకర్యాలు లేవనే విషయాన్ని ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరైన రోడ్డుతో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల, ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రి వంటి సౌకర్యాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఎలక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహించేవారు.. ఇలాంటి క్లిష్టమైన ఏరియాల్లో తమ విధులను ఎలా నిజాయితీగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. మారుమూల గిరిజన ప్రాంతాల సమస్యలను ప్రస్తావించినా.. ఇంకా ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు ఏ.ఆర్. మోహన్ ప్రభుత్వం చేయలేని కొన్ని పనులు ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే అవుతాయనే విషయాన్ని ఇందులో ప్రస్తావించాడు. ప్రజా ప్రతినిధులకన్న విధుల్లో యాక్టివ్గా నిజాయితీ ఉండే ప్రభుత్వ సిబ్బందితో ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందనే విషయాన్ని చూపించాలనుకున్నాడు.
ఈ సినిమాకు క్లైమాక్స్లో కలెక్టర్ త్రివేది (సంపత్ రాజ్) రియలైజ్ అయ్యే అంశాలను ఇందులో ప్రస్తావించారు. కానీ నిజ జీవితంలో అలాంటి జరిగే అవకాశాలు తక్కువ. ఈ విషయంలో దర్శకుడిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. ముఖ్యంగా గిరిజనులు ఆచార వ్యవహారాలు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి ప్రజలు విద్యకు దూరం కావడం వంటివి విషయాలను హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించాడు. ఇంటర్వెల్ తర్వాత రఘుబాబుతో చేయించిన ఒకే ఒక్క కామెడీ సీన్తో ఈ సినిమా చూసే ప్రేక్షకులను ఎడారిలో ఒయాస్సిగా కాస్తంత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ కామెడీ సీన్ తెలుగు సినిమాల్లో ఎవర్ గ్రీన్గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక మిగతా సినిమా మొత్తం సీరియస్గానే లాగించేసాడు. మొత్తంగా దర్శకుడు తాను అనుకున్న కథ ఓ అడవి వాతావరణంలో ఎంతో హృద్యయంగా చెప్పగలిగాడు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ రామిరెడ్డి ప్రకృతి అందాలను తన కెమెరాలో ఎంతో చక్కగా పిక్చరైజ్ చేసాడు. ఎడిటర్ తన తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో .. గతంలో చేసిన గమ్యం, నాంది సినిమాలతో ప్రూవ్ అయింది. తను కామెడీ టైమింగే కాదు.. ఇలాంటి ఎమోషన్తో కూడిన సినిమాలకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయనే విషయాన్ని తాజాగా విడుదలైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.ఈ చిత్రంలో ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా తెరపై కనిపించేది ఒక కొంత సేపే అయినా.. ఎలక్షన్ అధికారిగా తన విధిని బాధ్యతగా నిర్వహించే పాత్రలో చక్కగా నటించారు. అంతేకాదు ఒక ప్రాంత జనుల ఆకాంక్షలను నెరవేర్చే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది. గిరిజన యువతిగా కాకుండా.. మాములుగా కనిపించడం కాస్తంత మైనస్ అనే చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ ఈ సినిమాలో హీరోకు సహాయడు పాత్రలో ఇంగ్లీష్ టీచర్ పాత్రలో తన క్యారెక్టర్కు వంద శాతం న్యాయం చేసాడు.గిరిజన యువ నాయకుడిగా నటించి శ్రీతేజ్ నటన బాగుంది. మిగతా పాత్రల్లో నటించిన ప్రవీణ్,కలెక్టర్గా సంపత్ రాజ్, ఊరి ప్రజల నుంచి తక్కువ రేటుకే సరుకులు కొనే వ్యాపారి పాత్రలో రఘుబాబు నటన ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
కథ
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్
అల్లరి నరేష్ నటన
ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సీరియస్గా సాగే కథ, కథనం
స్లో నేరేషన్
చివరి మాట : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ..ఆలోచింపజేసే ఓ మంచి ప్రయత్నం..
రేటింగ్ : 3/5
కథ | : | 3/5 |
స్క్రీన్ ప్లే | : | 3/5 |
దర్శకత్వం | : | 3/5 |
సంగీతం | : | 2.5/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Itlu Maredumilly Prajaneekam, Tollywood, Vennela kishore