ప్రముఖ నటుడు సోనూ సూద్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు. ఐతే శరద్ పవార్ను సోనూసూద్ ఎందుకు కలిశాడన్న దానిపై అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ కూడా రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఐతే కేవలం మర్యాదపూర్వకంగానే శరద్ పవార్ను సోనూ సూద్ కలిసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇటీవల బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) సోనూ సూద్పై పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. జుహూ ప్రాంతలో ఉన్న తన ఆరంతస్తుల భవాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేకాదు ఆయన పాత నేరస్తుడని.. నేరాలు చేయడం అలవాటుగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే బీఎంసీ ఆరోపణలను సోను సూద్ తీవ్రంగా ఖండించారు. నివాస భవనాన్ని హోటల్గా మార్చేందుకు బీఎంసీ నుంచి 'చేంజ్ ఆఫ్ యూజర్' అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు. బీఎంసీ తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. సోనూసూద్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.
కరోనా లాక్డౌన్ నుంచి దేశవ్యాప్తంగా సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. లాక్డౌన్ సమయంలో తన సొంత డబ్బులతో వలస కార్మికులను పంపించారు. అంతేకాదు ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, రైతులు, విద్యార్థులును ఆదుకుంటున్నారు. ఇంకా ఆదుకుంటూనే ఉన్నారు. సినీ పరిశ్రమల పనిచేసే కార్మికులకు కూడా తన వంతుగా సాయం చేస్తున్నారు. అందుకే ఆయన్ను రియల్ హీరోగా దేశప్రజలు కీర్తిస్తున్నారు. మీ లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్సీపీ అధినేతను కలవడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.
Published by:Shiva Kumar Addula
First published:January 13, 2021, 11:15 IST