క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి. కొన్ని కోట్ల కొద్దీ కణాలతో రూపొందిన మానవ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ప్రారంభం కావచ్చు. వాస్తవానికి సహజంగానే మానవ శరీరంలోని కణాలు పెరుగుతాయి. కణ విభజన అనే ప్రక్రియ ద్వారా శరీరానికి అవసరమైన కొత్త కణాలు ఏర్పడతాయి. కణాలు పాతబడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి చనిపోతాయి. వీటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే కొన్నిసార్లు ఈ క్రమబద్దమైన ప్రక్రియ విచ్ఛిన్నమవుతుంది. దీంతో అవసరం లేని సమయంలో అసాధారణమైన లేదా దెబ్బతిన్న కణాలు పెరుగుతాయి. ఈ కణాలు కణితులను ఏర్పరుస్తాయి. ఇవి కణజాల గడ్డలుగా ఉంటాయి. ఈ కణితులు క్యాన్సర్ కావచ్చు లేదా క్యాన్సర్ కాకపోవచ్చు. క్యాన్సర్గా మారని కణితులను అపాయం కలిగించని లేదా నిరపాయమైన కణితి (Benign tumors) అంటారు.
క్యాన్సర్ కణితులు సమీపంలోని కణజాలాలలోకి వ్యాపిస్తాయి లేదా దాడి చేస్తాయి. కొత్త కణితులను (మెటాస్టాసిస్ అని పిలిచే ప్రక్రియ) ఏర్పరచడానికి శరీరంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. క్యాన్సర్ కణితులను ప్రాణాంతక కణితులు (Malignant tumors) అని కూడా పిలుస్తారు. అనేక క్యాన్సర్లు ఘన కణితులను (Solid tumors) ఏర్పరుస్తాయి.
లుకేమియా వంటి రక్త క్యాన్సర్లు సాధారణంగా ఇలా ఏర్పడవు. అపాయం కలిగించని కణితులు సమీపంలోని కణజాలాలలోకి వ్యాపించవు లేదా దాడి చేయవు. వీటిని శరీరం నుంచి తొలగిస్తే, సాధారణంగా మళ్లీ పెరగవు. కానీ క్యాన్సర్ కణితులు మాత్రం కొన్నిసార్లు పెరుగుతాయి. నిరపాయమైన కణితులు కొన్నిసార్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తాయి. మెదడులో ఏర్పడే నిరపాయమైన కణితులు కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.
వివిధ రకాల క్యాన్సర్లకు అనేక కారణాలు ఉన్నాయి. మానవులకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 200 కంటే ఎక్కువ రకాలు ఉన్నట్లు అంచనా. వీటిలో ఒక్కోదానికి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. వీటికి రోగనిర్ధారణ, చికిత్స మార్గాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. భారతదేశంలో అత్యంత సాధారణమైన క్యాన్సర్ రూపాలు.. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer), నోటి క్యాన్సర్ (Oral Cancer).
రొమ్ము క్యాన్సర్
ఇది భారతదేశంలో అత్యంత సాధారణమైన క్యాన్సర్ రూపం. ఇది సాధారణంగా 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు ఎక్కువగా సోకుతోంది. అయితే ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. దీని లక్షణాలు మారుతూ ఉంటాయి, కానీ కొన్ని సాధారణ లక్షణాలతో సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. రొమ్ము పరిమాణం, ఆకృతిలో మార్పు, రొమ్ములో ఎలాంటి నొప్పి కలిగించని గడ్డ ఏర్పడటం, చనుమొన కుంచించుకుపోవడం లేదా చనుమొన నుంచి స్రావాలు కారడం వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. రొమ్ము క్యాన్సర్ను మామోగ్రామ్ ద్వారా గుర్తిస్తారు.
ఈ ప్రక్రియలో ముందు రొమ్ము ఎక్స్-రేను పరిశీలిస్తారు. ఏదైనా సాధారణ, అసాధారణ కణజాలం ఉంటే పరీక్షలో బయటపడుతుంది. అసాధారణ కణజాలం ఉంటే, క్యాన్సర్ నిర్ధారణ కోసం మరిన్ని టెస్టులు సూచిస్తారు. మహిళకు 40 ఏళ్లు దాటిన తర్వాత మామోగ్రఫీ స్క్రీనింగ్ క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాలికలు/మహిళలందరూ కచ్చితంగా 20 ఏళ్ల తర్వాత నుంచి క్రమం తప్పకుండా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. రొమ్ములో అసౌకర్యంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
సర్వైకల్ క్యాన్సర్
భారతదేశంలో రెండో అత్యంత సాధారణ రకం క్యాన్సర్ ఇది. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారం (cervix) వద్ద వస్తుంది. గర్భాశయం కిందిభాగం యోనిలోకి తెరుచుకునే ప్రాతంలో అసాధారణ కణాల పెరుగుదల కారణంగా ఈ రకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలోనే నిర్ధారణ చేస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. సెక్స్ తర్వాత యోని నుంచి రక్తస్రావం కావడం, మెనోపాజ్ తర్వాత కూడా అసాధారణమైన రక్తస్రావం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పొత్తికడుపులో నొప్పి, సెక్స్ సమయంలో నొప్పి వంటివి ఇతర సాధారణ లక్షణాలు.
ఈ లక్షణాలు కనిపిస్తే.. సర్విక్స్ ప్రాంతంలో అసాధారణ కణాల పెరుగుదల ఉందో లేదో నిర్ధారించడానికి PAP స్మెర్ శాంపిల్ తీస్తారు. బయాప్సీ చేసి, ఫలితాల ఆధారంగా ఒక నిర్ధారణకు వస్తారు. అవసరమైతే డాక్టర్లు ఇతర టెస్టులు కూడా సిఫార్సు చేస్తారు.
నోటి క్యాన్సర్
భారతదేశంలో ఇది మూడో అత్యంత సాధారణ క్యాన్సర్ రూపం. ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఓరల్ క్యాన్సర్ కేసుల్లో 85% పైగా మన దేశంలోనే ఉంటున్నాయి. పొగాకు ఉత్పత్తుల వాడకం, మితిమీరిన మద్యపానం వంటివి ఈ రకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలు. నోటిలో దీర్ఘకాలం పాటు నయం కాని పుండ్లు, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది, దంతాలు వదులు కావడం లేదా ఊడిపోవడం, గొంతులో నొప్పి, వాయిస్లో మార్పులు.. వంటివి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు. ప్రారంభ దశలోనే ఈ రుగ్మతను గుర్తించి, చికిత్స అందిస్తే బాధితులు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి ముదిరితే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది.
క్యాన్సర్ అనేది తీవ్రమైన వ్యాధి. కానీ క్యాన్సర్ సోకిన వారు అందరూ మరణిస్తారని భావించకూడదు. ఎవరికైనా క్యాన్సర్ నిర్ధారణ అయితే.. నిపుణులైన వైద్య సిబ్బంది సహాయం, అత్యాధునిక చికిత్స మార్గాలు, సౌకర్యాలతో బాధితులు కోలుకోవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం రెగ్యులర్ క్యాన్సర్ చెకప్లు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎలాంటి క్యాన్సర్న అయినా ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చికిత్స ద్వారా బాధితులను కాపాడటం సులభం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breast cancer, Cancer