భారతదేశంలో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. ఈ సమయంలో అందంగా కనిపించేందుకు యువతులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందమైన, మెరిసే ముఖ చర్మం (Face Skin) కోసం చాలామంది రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఈ ఫెస్టివల్ సీజన్లో కెమికల్ ప్రొడక్ట్స్పై ఆధార పడాల్సిన అవసరం లేకుండా.. సహజసిద్ధమైన (Natural) పదార్థాలతోనే చాలా అందంగా తయారవ్వచ్చు. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చందనం, రోజ్ వాటర్..
రోజ్ వాటర్ స్కిన్ PH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. చందనం లేదా గంధం చర్మ రంగును మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. చందనం, రోజ్ వాటర్ కలిపి ముఖం, మెడకు అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచాలి. ఇది ఆరిపోయినప్పుడు, చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
బొప్పాయి, తేనె..
తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తే, బొప్పాయిలోని ఎంజైమ్లు సహజ చర్మాన్ని తెల్లగా చేయడంలో హెల్ప్ అవుతాయి. ఒక గిన్నెలో 4 టీస్పూన్ల బొప్పాయి ముక్కలు వేసి, గుజ్జు చేయాలి. దానికి 2 టీస్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమం కాస్త గట్టిగానే ఉండాలి. మరీ కారుతున్నట్లు ఉండకూడదు. ఎందుకంటే అది ముఖానికి అంటుకోదు. చక్కగా దీన్ని ప్రిపేర్ చేశాక ముఖం, మెడకు అప్లై చేసి రెండు గంటలపాటు అలాగే ఉంచాలి. వెచ్చని నీటితో తొలగించాలి.
కుంకుమ పువ్వు, పాలు..
కుంకుమపువ్వు, పాలు రెండు కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కుంకుమపువ్వు ముఖాన్ని చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది. పాలలోని లాక్టిక్ యాసిడ్ ముఖ చర్మంపై చనిపోయిన మృతకణాలను తొలగించడంలో సహాయం చేస్తుంది. 3-4 టేబుల్ స్పూన్ల చల్లని పాలలో 2-3 కుంకుమపువ్వులను యాడ్ చేసి బేసిన్లో నానబెట్టాలి. ముఖానికి అప్లై చేయడానికి ముందు 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. తర్వాత ముఖానికి ఆ మిశ్రమం అప్లై చేసుకోవాలి. ఈ పలుచని పొర ఎండిన తర్వాత మరొకసారి ముఖానికి రాయాలి. తడి ఆరిపోయిన తర్వాత దీనిని చల్లటి నీటితో కడగాలి.
ఆల్మండ్ పౌడర్, మిల్క్ క్రీమ్..
ఆల్మండ్ (బాదం) పౌడర్, మిల్క్ క్రీమ్ కలిపి తయారుచేసే ఫేస్ మాస్క్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ మాస్క్ మీ చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. 4-5 బాదంపప్పులను పొడి రూపంలో గ్రైండ్ చేసి.. ఆ ఆల్మండ్ పౌడర్ను 2-3 టీస్పూన్ల మిల్క్ క్రీమ్ వేసి మీ ముఖం, మెడకు అప్లై చేయాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు 2 గంటలు ఆరనివ్వాలి. దీనిని మీ చర్మానికి అప్లై చేసుకుంటే స్మూత్ స్కిన్ మీ సొంతమవుతుంది.
టమాట, సెనగ పిండి..
టమాటా గుజ్జును మెత్తగా చేసి, దానికి 2-3 టీస్పూన్ల సెనగ పిండి కలపాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది తడి ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే మీ మెడ, ముఖ చర్మం నిగారింపుతో మెరుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.