శరీరంలోని కణజాలం అవసరం లేకున్నా విపరీతంగా వృద్ధి చెందడమే క్యాన్సర్. ఇవి గుంపులు గుంపులుగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటిని క్యాన్సర్ కణితి అంటారు. సాధారణంగా శరీరంలో ఏ భాగానికైతే క్యాన్సర్ సోకుతుందో దానిపేరుతోనే పిలుస్తుంటారు. ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్లలో ఇది ఒకటి. కిడ్నీ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా 1.8 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో ప్రతి 442 మంది పురుషుల్లో ఒకరికి, 600 మంది మహిళల్లో ఒకరికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మహిళల కంటే పురుషులకే ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కిడ్నీ క్యాన్సర్కు దారితీసే కారకాలు
కిడ్నీ క్యాన్సర్కు కారణమయ్యే కచ్చితమైన కారకాలపై ఇంకా సమగ్రంగా విశ్లేషణ లేదు. అయితే ధూమపానం, వంశపారంపర్యంగా వ్యాపించడం, ఊబకాయం, ఆల్కహాల్ వంటివి కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు. వయస్సు కూడా ఒక కారకం అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఇన్ ఫెక్షన్ వృద్ధి చెందే అవకాశం ఉండడంతో ఏజ్ను కూడా ఈ లిస్ట్లో చేర్చారు.
లక్షణాలు
కిడ్నీ క్యాన్సర్ను ‘సైలెంట్ డిసీజ్’గా పరిగణిస్తారు. ఈ వ్యాధి సోకిన వెంటనే ఎటువంటి శారీరక మార్పులకు దారితీయదు. వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడం ప్రారంభమవుతుంది. సాధారణంగా కిడ్నీ క్యాన్సర్ లక్షణలు ఇలా ఉంటాయి. మూత్రవిసర్జన సమయంలో రక్తస్రావం అవుతుంది. ఇది చాలా కామన్గా ఉంటుంది. పొత్తికడుపులో లేదా పక్క భాగాలలో గడ్డలా ఉంటుంది. అలాగే ఆకలి మందగిస్తుంది. నిరంతరం అలసటగా ఉంటుంది. అది దీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉంది. శరీర బరువు కూడా తగ్గుతుంది. అదే పనిగా జ్వరం రావడం, శ్వాస ఆడకపోవడం, దగ్గినప్పుుడు రక్తం పడడం, ఎముకల్లో తీవ్ర నొప్పి ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి.
వ్యాధి నిర్ధారణ
కిడ్నీ క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మొగ్గ దశలోనే రోగాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే తదుపరి చికిత్స కూడా అత్యంత కీలకం. దీంతో లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. కిడ్నీలో క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారించడానికి సాధారణంగా యూరిన్ టెస్ట్, CT స్కాన్ చేస్తుంటారు.
ట్రీట్మెంట్ ఆప్షన్స్
వ్యాధి దశ, వయస్సు, లోకేషన్ వంటి కారకాలను దృష్టిలో ఉంచుకుని సరిపోయే సరైన చికిత్సను రోగికి సూచించడం చాలా ముఖ్యం. కిడ్నీ క్యాన్సర్కు అత్యంత సాధారణ చికిత్సా ఎంపికలలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ కీలకమైనవి.
ఎన్సీఆర్పీ 2021 నివేదిక ప్రకారం.. కిడ్నీ క్యాన్సర్ విషయంలో శస్త్రచికిత్స ఎక్కువ సందర్భాల్లో చేస్తుంటారు. కిడ్నీ నుంచి శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగిస్తారు. కణితి మొత్తం కిడ్నీకి వ్యాపిస్తే, కణితితో పాటు మొత్తం కిడ్నీని తొలగిస్తారు. ఇతర సందర్భాల్లో కణితి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మాత్రమే శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. కిడ్నీకి కాకుండా ఇతర శరీర అవయవాలకు క్యాన్సర్ వ్యాపించినప్పుడు శస్త్రచికిత్స అనేది సరైన చికిత్స ఎంపిక కాదు. బదులుగా, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ప్రత్యామ్నాయ చిక్సితలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ లక్షణాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆల్కహాల్, పొగా వినియోగానికి దూరంగా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Cancer cells, Health, Kidney