దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. దీంతో, అంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్డౌన్తో మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్నా వర్కింగ్ మదర్స్కు మాత్రం పనిభారం పెరిగింది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనై రోజుకు 5.50 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నారని మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ ఎక్స్సెల్ డేటా మ్యాట్రిక్స్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,200 వర్కింగ్ ఉమెన్పై జరిగిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. లాక్డైన్తో ఓవైపు పిల్లలు, వృద్ధుల సంరక్షణ చూసుకోవడం, మరోవైపు తమ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్పూర్తి చేసుకోవడంలో వర్కింగ్ ఉమెన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా కరోనా సంక్రమణ ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వృద్ధుల సంరక్షణకు ఎక్కువ వారు సమయం కేటాయించాల్సి వస్తోందని తేలింది.
కరోనా ముందు కాలంతో పోల్చితే వృద్ధుల సంరక్షణ కోసం ఇప్పుడు 1.50 గంటలు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని సర్వే తేల్చి చెప్పింది. ఈ అధిక పని ఒత్తిడి క్రమంగా వారి నిద్ర సమయంపై పడుతుంది. కరోనాకు ముందు వర్కింగ్ ఉమెన్ సగటున ప్రతిరోజూ 6.50 గంటలు నిద్రపోయేవారని, ఇప్పుడు కేవలం 5.50 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని సర్వేలో స్పష్టమైంది. ఈ గణాంకాలను పోల్చి చూస్తే ప్రస్తుతం వారు సుమారు 17 శాతం తక్కువ సమయం నిద్రపోతున్నారని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి వర్కింగ్ ఉమెన్ లైఫ్ స్టైల్ను కూడా మార్చేసింది. అధిక పని భారంతో వర్కింగ్ ఉమెన్లో వ్యాయామం, ఎంటర్టైన్మెంట్ సమయం కూడా గణనీయంగా తగ్గింది.
1,200 మంది మహిళలపై సర్వే..
మరోవైపు దాదాపు ఏడాది నుంచి విద్యాభోధన అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. దీంతో, పిల్లలకు చదువు చెప్పడానికి, వారికి మార్గదర్శకత్వం చేయడానికి తల్లులు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది కూడా వారిపై ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం. సర్వేలో 30 శాతం మంది మహిళలు ఎక్కువగా ఇంటి పనులపై కంప్లెయింట్ చేయగా, 26 శాతం మంది పిల్లల సంరక్షణ బాధ్యతలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇక 30 శాతం మంది మహిళలు తమలో మానసిక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నామని పేర్కొనగా.. మరో 26 శాతం మంది తమకు శారీరక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు.
ఈ సర్వే ఫలితాలపై మార్కెట్ ఎక్స్సెల్ డేటా మ్యాట్రిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని అరోరా మాట్లాడుతూ “ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా, దీని ప్రభావం వర్కింగ్ ఉమెన్పై ఎక్కువగా ఉంది. వారు తమ వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబ బాధ్యలు నెరవేర్చడంలో బ్యాలెన్స్ చేయడంలో ఒత్తిడికి లోనవుతున్నారని మా సర్వేలో తేలింది. ఈ సర్వేను 25 నుండి -45 మధ్య వయస్సు గల 1,200 మంది వర్కింగ్ ఉమెన్పై దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాం.” అని ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Lifestyle, Lockdown, Lockdown relaxations