THE WAVE OF THE FALLEN MOVEMENT HAS BECOME A MOVEMENT WITHOUT A PATH WHAT IS THE REASON FOR THAT KMM VB
The Wave Of Movement: పడిలేచిన ఉద్యమ కెరటం.. దారి తెన్నూ లేని ఉద్యమంగా మారింది.. దానికి గల కారణం ఏంటి..?
మావోయిస్టులు (ఫైల్)
ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం అంతే వేగంగా వెనుకబాటుకు గురవుతోంది. టాప్ క్యాడర్లోని ఒక్కొక్కరు ఒక్కో కారణంగా ఉద్యమానికి దూరం కావడంతో ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దిక్కు లేని ధైన్యం ఎదురైంది. కొన్ని నెలలుగా కరోనా వైరస్ ధాటికి అనేక మంది మావోయిస్టు నేతలు మృత్యువాత పడగా, తాజాగా ఆర్కే అనారోగ్యంతో మరణించడంతో మావోయిస్టులకు సిద్ధాంతకర్తలు కరువైన పరిస్థితి నెలకొంది.
ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం(The Wave of movement) అంతే వేగంగా వెనుకబాటుకు గురవుతోంది. టాప్ క్యాడర్లోని(Top Cader) ఒక్కొక్కరు ఒక్కో కారణంగా ఉద్యమానికి దూరం కావడంతో ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దిక్కు లేని ధైన్యం ఎదురైంది. గత కొన్ని నెలలుగా కోవిడ్ కరోనా వైరస్ ధాటికి అనేక మంది మావోయిస్టు నేతలు మృత్యువాత పడగా, తాజాగా ఆర్కే లాంటి అగ్ర నేతలు సైతం అనారోగ్యంతో మరణించడంతో మావోయిస్టులకు సిద్ధాంతకర్తలు కరవైన పరిస్థితి నెలకొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అలియాస్ రామకృష్ణ, అలియాస్ సాకేత్, అలియాస్ శ్రీనివాసరావు, అలియాస్ సంతోష్ అలియాస్ గోపాల్, అలియాస్ పంతులుగా పలు సందర్భాల్లో పలు పేర్లతో నాలుగు దశాబ్దాల పాటు తీవ్రవాద ఉద్యమానికి నేతృత్వం వహించిన అగ్రనేత మృతితో ఉద్యమం దిక్కులేని దైన్యాన్ని ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా దండకారణ్యంలోని ఏవోబీ సహా చత్తీస్ఘడ్, ఒడిశా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అగ్రనేత మరణం మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా భావిస్తున్నారు. కమాండర్ స్థాయిలో అనుకున్న పనులను చక్కబెట్టే నాయకత్వం ఉన్నప్పటికీ మేథోమధనం చేయగల నేతలు ఒక్కొక్కరు మరణం వల్లనో, అనారోగ్యం కారణంగానో పార్టీకి దూరం కావడం భవిష్యత్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉందంటున్నారు.
తొలుత పీపుల్స్వార్, ఆనక విలీనం అనంతరం మావోయిస్టు పార్టీలోనూ నాలుగు దశాబ్దాల పాటు వివిధ స్థాయిల్లో సేవలు అందించి ఉద్యమ ఉనికిని తెలుగు రాష్ట్రాల నుంచి చత్తీస్ఘడ్, ఒడిషా, ఝార్ఘండ్, బీహార్ మీదుగా నేపాల దాకా రెడ్ కారిడార్ నిర్మించిన అగ్రనేత ఆర్కే మరణం ఆ పార్టీ భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఉందంటున్నారు. ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివిన ఆర్కే లాంటి దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్లు ఈ తరంలో ఉద్యమానికి దొరకడం లేదన్నది నిజం. నమ్మిన సిద్ధాంతం కోసం కుటుంబం మొత్తం ఉద్యమమే ఊపిరిగా బతికిన ఆర్కే లాంటి నేతల లోటు ఇప్పుడు నేరుగా కనిపించే పరిస్థితి ఉంది.
ఎనభై, తొంబై దశకాల్లో నల్లమల అటవీ ప్రాంతంలో పీపుల్స్వార్ ఉనికిని చాటి, పల్నాడులోని పలు ప్రాంతాల్లో సమాంతర పాలనను శాసించిన పార్టీ క్రమంగా తన ఉనికిని కేవలం ఏజెన్సీకి పరిమితం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో జరిగిన చర్చల అనంతరం, పీపుల్స్వార, ఎంసీసీ విలీనం కావడం.. మావోయిస్టు పార్టీగా అవతరించడం.. ఇక అప్పటి నుంచి క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు రాష్ట్రాధినేత అయినా మావోయిస్టు ఉద్యమం విషయంలో ఒకే పంథాను అనుసరించడం ఫలితాన్ని ఇచ్చినట్లయింది.
అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాభీష్టాన్ని బలపర్చడం ద్వారా మరోసారి మావోయిస్టులు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, 2014లో తెలంగాన ఆవిర్భావంతో ఆ ఆకాంక్ష పేరిట ప్రజలకు చేరువయ్యే అవకాశం చేజారింది. ఇక ప్రస్తుతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని చాటుకోలేని స్థితిలో ఉంది.
నో రిక్రూట్మెంట్స్... గతంలో యూనివర్శిటీలు, కాలేజీల్లో విద్యార్థి ఉద్యమాలు నిరంతరం ఉండడం, ఆయా సందర్భాల్లో వామపక్ష ఉద్యమ ప్రభావం పడుతుండడం, అది క్రమంగా తీవ్రవాద ఉద్యమం పట్ల యువత ఆకర్షితులు అవడం జరుగుతుండేది. అప్పట్లో సోషల్ సెంట్రిక్గా వ్యక్తి ఆలోచనా విధానం ఉండేదని, అయితే గత మూడు దశాబ్దాలలో దేశంలో చోటుచేసుకున్న ఆర్ధిక సంస్కరణలు, గ్లోబలైజేషన్, మార్కెటైజేషన్, లిబరలైజేషన్ తదితర ప్రభావాల వల్ల యువతలో వ్యక్తి కేంద్రకంగా ఆలోచనా విధానంలో మార్పులు రావడం మూలంగా ఇండివిడ్యువల్ సెంట్రిక్గా పరిస్థితులు మారాయన్నది పరిశీలకుల మాట. దీని ఫలితంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సైతం బలమైన పోరాటాలను నిర్మించలేని ధైన్యం నెలకొందని చెబుతున్నారు.
దీనికితోడు తీవ్రవాద ఉద్యమంలోని పలువురు నేతల వ్యక్తిగత జీవితం, త్యాగం లాంటివి హీరోయిక్గా ఉంటూ యువతను ఆకర్షిస్తుండేవి. క్రమంగా వాటి స్థానంలో వ్యక్తిగత జీవితంలో పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, కోల్పోతున్న ప్రాణాలు తీవ్రవాద ఉద్యమం పట్ల ఒక రకమైన భయాన్ని పెంచుతున్నట్లయిందని చెబుతున్నారు. దీంతోపాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష తీవ్రవాదం అణచివేతలో అమలు చేస్తున్న విధానాలు, పోలీసు అధికారుల వ్యూహాలు ఫలితాన్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనివల్లే తెలుగు రాష్ట్రాల్లో తిరిగి తమ ప్రాబల్యం పెంచుకోవాలన్న మావోయిస్టు అగ్రనేతల ఆశలు నెరవేరని పరిస్థితి ఉంది.
దాదాపు గత పదేళ్లలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణ పరంగా పెద్దగా ఏమీ సాధించలేదనే చెప్పాలి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు సైతం తీవ్రవాద ఉద్యమం పట్ల ప్రజల్లో ఒకింత ఆకర్షణ తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. దీనికితోడు వయోభారంతో సీనియర్ నేతలు లొంగుబాట పడుతుండడం, అదే స్థాయిలో రిక్రూట్మెంట్లు లేకపోవడం ఉద్యమ తీవ్రత తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల హోల్టైమర్లను సైతం నియమిస్తున్న పరిస్థితి ఉందని పోలీసు ఉన్నతాధికారులు అనేక సందర్భల్లో చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. మిలీషియా, ఇంకా కింది స్థాయి క్యాడర్ చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నప్పటికీ, ఉద్యమానికి దిక్సూచిగా పనిచేసే దిశానిర్దేశం చేసే నాయకత్వ లోపం మావోయిస్టు పార్టీని పట్టి పీడిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.