MANY POLICE OFFICERS WHO REMAINED WITHOUT POSTING WHEN THE PROMOTION CAME IN KHAMMAM DISTRICT SNR KMM
Telangana: అక్కడ పోలీస్ అధికారులకు ప్రమోషన్ వచ్చింది..కాని పోస్ట్ మారలేదు
(ప్రమోషన్ ఓకే ..మరి పోస్టింగ్)
Khammam: రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో పదోన్నతి కల్పించిన వారికి పోస్టింగ్లు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాది క్రితం ఎస్ఐ, సీఐ,డీఎస్పీలకు పదోన్నతలు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసినప్పటికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఒట్టి డిజిగ్నేషన్తో సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు కొందరు అధికారులు.
(G.Srinivasreddy,News18, Khammam)
కష్టపడి పోలీసు(Police) ఉద్యోగం సంపాధించడం, సిన్సియర్గా ఆ ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడం, ఎక్కడా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు లేకుండా విధి నిర్వాహణలో కొనసాగుతున్న ఇంకా పోలీస్శాఖ(Police Department)లో పనిచేస్తున్న కొందరిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ల(7years)కుపైగా గడిచిపోయింది. కాని పోలీస్శాఖలో పోస్టింగ్(Posting)ల విషయంలో మాత్రం సర్కారు ఓ ప్రత్యేకమైన పాలసీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎస్(IPS)లు మినహాయిస్తే డీఎస్పీ(DSP)లు, సీఐ(CI)లు ఎస్సై(SI)ల పోస్టింగ్లన్నీ స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నాల్లోనే జరుగుతున్నట్లుగా సిస్ట్యూవేషన్ కనిపిస్తోంది. ఈ స్థాయి విమర్శలు ఎందుకొస్తున్నాయంటే రాష్ట్రంలో 110 మంది డీఎస్పీలకు ఏడాది క్రితం పదోన్నతి కల్పించినప్పటికి పదిమందికి మాత్రం అక్కడక్కడా ఫోకల్ పోస్టింగులు దక్కాయి. మిగిలిన వాళ్లంతా ఉన్నచోటే ఉన్నారు. పేపర్ పైన డిజిగ్నేషన్ (Designation)మారింది తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న ఆవేదన చాలా అధికారుల్లో కనిపిస్తోంది. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే 110 మందిలో వివిధ అనుబంధ విభాగాల్లో అటాచ్ అయిన వాళ్లు.. పోస్టింగ్ దక్కించుకున్న వాళ్లను మినహాయిస్తే మిగిలిన వాళ్లకు ఏడాదిగా జీతం రాని దుస్థితి.
ప్రమోషన్ వచ్చినా..
ఒకే బ్యాచ్కి చెంది పదోన్నతులు పొందిన వాళ్లలో హైదరాబాద్ సిటీ వింగ్ అధికారులు వీళ్లకన్నా మూడేళ్ల ముందే డీఎస్పీలుగా పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని నష్టపోతున్న అధికారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ..గతేడాది ప్రమోషన్ ఇచ్చినప్పటికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచారు. దీన్ని బట్టి చూస్తుంటే సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారుల సేవలను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు అనుయాయులుగా ఉంటేనో లేదంటే అమ్యామ్యాలు చెల్లించుకుంటే తప్ప పోస్టింగ్ రాని పరిస్థితి. రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఇన్స్పెక్టర్ కీలకమైన సర్కిల్లో పోస్టింగ్ కోసం స్థానిక ప్రజా ప్రతినిధికి రూ.25 లక్షలు ఇచ్చి లేఖ తెచ్చుకుని జాయిన్ అయ్యారన్న ప్రచారం ఉంది. ఇదే విషయాన్ని న్యూస్18 ఓ పోలీసు ఉన్నతాధికారిని అడిగేందుకు ప్రయత్నిస్తే ఖండించిన పరిస్థితి లేదు.
పోస్టింగ్ లేని దుస్థితి..
ఇందులో అధికారి ట్రాక్ రికార్డ్, సర్వీస్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదన్న అపవాదు ఉంది. కేవలం ఎమ్మెల్యే కోరుకున్న చోట ఆ అధికారికి పోస్టింగ్ కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగలేక, పోస్టింగ్ కోసం అర్థించలేక ఉన్నచోటే ఉండిపోతున్నారు చాలా మంది అధికారులు. ఇది ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలకే పరిమితం కాలేదు. చివరకు ఐపీఎస్ అధికారుల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేని దుస్థితి. ప్రమోషన్ పొందిన సీనియర్ ఐపీఎస్లు సైతం ఉన్నచోటే ఏళ్ల తరబడి పనిచేస్తున్న పరిస్థితి. ఇది సహజంగానే ఉద్యోగవర్గాల్లో ఆందోళన, అసహనాన్ని నింపుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ అవ్యవస్థను సరిచేయాల్సిన పరిస్థితి ఉంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.