(P.Srinivas,New18,Karimnagar)
ఆయన ఊరి పెద్ద. గ్రామస్తులు మర్యాద ఇవ్వాల్సిన హోదా కలిగిన వ్యక్తి. కాని వాళ్లే అనుమానించడం, అవమానించడం చివరకు ఆయన పరువును బజారుకీడ్చడంతో భరించలేకపోయాడు. తన సచ్చీలతను నిరూపించుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో ప్రాణాలు తీసుకోవడమే సరైన మార్గమని భావించాడు. కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన నిజాయితీ తెలుస్తుందనవి బలవన్మరణానికి ప్రయత్నించి చావు-బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కలకలం రేపిన ఈ ఘటన కరీంనగర్(Karimnagar)జిల్లాలో చోటుచేసుకుంది.
సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్ ..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ బింగి కరుణాకర్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. రంగాపూర్ గ్రామంలో పద్మశాలి భవనం నిర్మాణం చేపట్టారు సర్పంచ్ కరుణాకర్. వాటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో పరిచయస్తుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి పెరగడంతో ఏదో రకంగా డబ్బులు చెల్లించాడు.
టార్చర్ భరించలేక..
సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం చేసిన పనికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వాళ్లకు తిరిగి చెల్లించడంతో ఆర్ధికంగా కృంగిపోయాడు సర్పంచ్ కరుణాకర్. ఇదే సమయంలో గ్రామ సర్పంచ్పై అప్పుగా డబ్బులు ఇచ్చిన సిద్ధి కిరణ్, అతని భార్య లిఖిత పద్మశాలి భవన స్తలాన్ని సర్పంచ్ కరుణాకర్ అమ్ముకున్నాడనే తప్పుడు ప్రచారం చేశారని బాధితుడు సూసైడ్ లెటర్లో రాశాడు. ఇదే విషయాన్ని గ్రామస్తులు, పద్మశాలి కులసంఘం పెద్దలు నమ్మి తనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని...పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించడంతో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు.
అసత్య ప్రచారం ..
పద్మశాలి భవనం స్తలం విక్రయించిన డాక్యుమెంట్లను సాక్ష్యంగా చూపిస్తూ గోడ నిర్మిస్తున్న స్తలాన్ని సర్పంచ్ అమ్ముకున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో తన పట్ల కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీఐకి చెప్పుకుందామని ఐదు సార్లు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పురుగుల మందు తాగి తన నిజాయితీని నిరూపించుకోవాలని భావించాడు. అందులో భాగంగానే బలవన్మరణానికి పాల్పడ్డాడు రంగాపూర్ సర్పంచ్ కరుణాకర్.
నిజాయితీ నిరూపించుకునేందుకే..
చనిపోయే ముందు తనకు జరిగిన అవమానం, తనను మోసం చేసిన తీరుపై వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నాడు. దాంతో పాటే నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు సర్పంచ్ కరుణాకర్. సర్పంచ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సర్పంచ్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందంటున్నారు డాక్టర్లు. మరోవైపు గ్రామ ప్రధమ పౌరుడికి ఈ విధమైన అవమానం జరగడం అత్యంత శోచనీయమని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Suicide attempt