(G.SrinivasReddy,News18,Khammam)
ఓ చిన్నారిని కులం కాటేసింది. కపటత్వం, మోసం, పగ, ప్రతీకారం వంటి మాటలు సరిపోని ఈ ఘటనలో తొమ్మిదో తరగతి(Ninth class)చదువుతున్న చిన్నారి బలైపోయింది. తల్లిదండ్రలు మధ్య ఉన్న వైవాహిక గొడవల కారణంగా పెద్ద మనుషుల తీర్మానంతో బడిలో పాఠాలు చదువుకోవాల్సిన చిన్నారి(Minor girl), బలవంతపు పెళ్లి(Marriage).. శోభనం పేరుతో నిత్యం నరకం అనుభవిస్తున్న ఘటన ఖమ్మం(Khammam)జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తనకు తెలియకుండా కుమార్తె వివాహం జరగిందంటూ తండ్రి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
కుల దురహంకారం..
కులం కాటుకు ఓ మైనర్ బాలిక గాయపడిన వార్త ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన ఉప్పలరాజుకు ఖమ్మం పట్టణం పాకబండబజారుకు చెందిన బొజ్జమ్మతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నలుగురు సంతానం ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు ఉండటంతో పరస్పర అంగీకారంతో విడిపోవడానికి కోర్టులో డైవర్స్ పిటిషన్ పెట్టుకున్నారు.భార్యభర్తలు కోర్టు ద్వారా విడాకులు పొందాలని చూడటాన్ని కుల పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దానికి ప్రతీకారంగా ఉప్పలరాజుకు కనీస సమాచారం ఇవ్వకుండానే, అతని భార్య సంరక్షణలో ఉన్న పదిహేనేళ్ల కుమార్తెకు గత నెల 26వ తేదీన బలవంతంగా పెళ్లి జరిపించారు.
ముచ్చుపచ్చలారని పిల్లకు పెళ్లి..
ఈ విషయంలో బాలిక అప్పుడే తనకు పెళ్లి వద్దని తనకు చదువుకోవాలని ఉందంటూ చెప్పినప్పటికి వినిపించుకోలేదు. కనీసం తన తండ్రికి కబురు చేయమని ఏడ్చినా పట్టించుకోలేదు. ఆమె మాటకు విలువ ఇవ్వలేదు. బలవంతంగా పసుపు తాడు పేరుతో మైనర్ బాలిక మెడలో ఓ పలుపుతాడు వేయించారు. పెళ్లి జరిగింది కాబట్టి పెళ్లి ఆమె భర్తగా ఉన్న నర్సింహ అనే వ్యక్తి మైనర్ బాలికపై నిత్యం అత్యాచారం చేస్తూ వచ్చాడు. విషయం బాలిక తండ్రికి వేరే వాళ్ల ద్వారా తెలియడంతో మండిపడ్డాడు. కులపెద్దల తీర్పును కాదన్నందుకు ఇలా చేస్తారా అని నిలదీశాడు. విడాకుల కోసం ఎదురుచూస్తున్న భార్యను సైతం ఈవిషయంలో మందలించాడు.
కాపురం పేరుతో మైనర్పై అత్యాచారం..
కులం కట్టుబాట్లు, కుల పెద్దల నిర్ణయం పేరుతో చేసిన తప్పుడు పనిపై తీవ్రంగా మండిపడ్డాడు అప్పలరాజు. తనపై ఉన్న కోపంతో అభం, శుభం తెలియని తన కుమార్తెను బలి చేశారని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన కూతురుకు జరిగిన అన్యాయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మంచిగా చదువుకుంటున్న చిన్నారికి బలవంతంగా పెళ్లిచేసి వేధిస్తున్నారని, తనను కలవనీయకుండా కుమార్తెను ఎక్కడో రహస్య ప్రదేశంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఛైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా విచారణ జరిపారు.
18మందిపై కేసు నమోదు..
జగిత్యాలలో ఉన్న చిన్నారి పెళ్లికూతురును కూడా విచారించారు. ఆమె వయసును, ఆమె అభ్యంతరాలను నమోదు చేసుకున్న అధికారులు చిన్నారులపై అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఛైల్డ్ హరాస్మెంట్ కేసును నమోదు చేశారు. బాల్య వివాహాన్ని ప్రోత్సహించినందుకు, మైనర్ బాలికపై అత్యాచారం, కిడ్నాప్కు పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద పద్దెనిమిది మంది కుల పెద్దలపై కూడా కేసు నమోదు చేశారు. కుల పెద్దల అకృత్యానికి బలైపోయిన చిన్నారిని ఛైల్డ్ కేర్ సెంటర్కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.