సమాజంలో ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పించే దిశగా తమిళనాడు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అంటే సెప్టెంబర్ 13న నీట్ను (NEET) తమిళనాడు నుంచి శాశ్వతంగా మినహాయించాలని డీఎంకే సర్కారు ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును తమిళనాడు (Tamil Nadu) శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయాల్సి ఉంది. నీట్ను రద్దు చేసి.. 12వ తరగతి మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. మెడికల్ ప్రవేశాలకు నీట్ ఒక్కటే మార్గం కాకూడదని స్టాలిన్ సర్కార్ నిర్ణయించుకుంది. అలాగే మెడికల్ కాలేజీల్లో 7.5% సీట్ల రిజర్వేషన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని ప్రతిపాదించింది.
నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత ఏం జరగనుంది?
నీట్ పరీక్షను భర్తీ చేసేందుకు ఇప్పటివరకూ ఎటువంటి ప్రవేశ పరీక్షను ఫైనలైజ్ చేయలేదు. ఈ వివాదాస్పద వైద్యపరీక్ష నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఎలా మినహాయించాలనే దానిపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రంతో చర్చించిన అనంతరం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మోడ్ లేదా పరీక్ష వికేంద్రీకరణ లేదా మల్టిపుల్ అటెంప్ట్స్ లేదా ఇతర ప్రవేశ మార్గం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆల్ ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల అడ్మిషన్లను కేంద్రం ఆధీనంలో నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో 15% కేంద్రమే భర్తీ చేస్తుంది. మిగిలినవి నీట్ స్కోర్ల ఆధారంగా రాష్ట్రాలు అడ్మిషన్లను కేటాయిస్తాయి.
జేఈఈ పరీక్షను వదిలేసి నీట్ పరీక్షను మాత్రమే ఎందుకు రద్దు చేస్తున్నారు?
ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్స్ను కేంద్రం నిర్వహిస్తోంది. అయితే జేఈఈ కేంద్రీకృత పరీక్షే అయినప్పటికీ దాన్ని వదిలేసి నీట్ను ఎందుకు రద్దు చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానంగా.. ఒకేరోజు నిర్వహించే నీట్ పరీక్ష విద్యార్థులపై ఒత్తిడి తెస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర, కేంద్ర స్థాయి పరీక్షలు ఉన్నాయని.. కానీ మెడికల్ విద్యార్థులకు కేంద్రం, రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ప్రవేశం పొందాలంటే నీట్ పరీక్ష ఒకటే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
నీట్ వల్ల ఎదురయ్యే సామాజిక, ఆర్థిక ప్రభావాలు ఏవి?
నీట్ వల్ల ఎదురయ్యే సామాజిక, ఆర్థిక ప్రభావాలను అధ్యయనం చేయడానికి గతంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నీట్ ఆధారంగా మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు.. 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు పొందిన వారికంటే గొప్పగా చదవడం లేదని కమిటీ తేల్చింది. ధనిక విద్యార్థులు మాత్రమే అధిక స్కోరు సాధించగలిగారని కమిటీ రిపోర్ట్ వెల్లడించింది.
రెండు రోజుల క్రితం నీట్ పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని భయంతో 19 ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ మరింత పెరిగిపోయింది. సీఎం స్టాలిన్ సైతం పరీక్ష రద్దు చేసేందుకు న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కోటా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం:
సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయ్యే అవకాశాలు కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం EWS, OBC అభ్యర్థులకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఇవి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లకు అదనంగా ఉంటాయి. ఎస్సీకి 15%.. ఎస్టీకి 7.5% రిజర్వేషన్తో పాటు.. ఆల్ ఇండియా కోటా (AIQ) కింద వైద్య ప్రవేశాలలో OBC కి 27% సీట్లు, EWS కేటగిరీ విద్యార్థులకు 10% రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NEET 2021