కేంద్ర హోంశాఖ అన్ లాక్ 5 మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టులో ప్రకటించిన గైడ్ లైన్స్ పరిమితి నేటితో ముగియడంతో కేంద్ర హోంశాఖ మళ్లీ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. స్కూళ్లు, సినిమా హాళ్ల రీ ఓపెనింగ్కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 తర్వాత దశలవారీగా వాటిని తెరవొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవచ్చు. స్కూళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆన్ లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు. ఆన్ లైన్ క్లాసుల విధానాన్ని ప్రోత్సహించాలి. స్కూళ్లు ఓపెన్ చేసిన తర్వాత కొందరు ఆన్ లైన్ క్లాసులు వినడానికి ఇష్టపడితే వారికి ఆ అవకాశం కల్పించాలి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాత ప్రత్యక్షంగా క్లాసులకు హాజరుకావాలి. అటెండెన్స్ తప్పనిసరికాదు. తమ రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేయాలి. అన్ని విద్యాసంస్థలు సదరు నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
ఇక 10 సంవత్సరాల లోపు పిల్లలు అంతా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి 10 సంవత్సరాల లోపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రశ్నార్థకం. వారిని కేవలం ఆన్ లైన్ క్లాసులకే పరిమితం చేస్తారా? ఒకవేళ ఆన్ లైన్ క్లాసులే నిర్వహిస్తే ఆ వయసు వారికి ఆన్ లైన్ క్లాసులు ఏం అర్థం అవుతాయనేది మిలియన్ డాలర్ ప్రశ్న. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు (పదేళ్ల లోపు) చదివే విద్యార్థులు ఇప్పుడు డోలాయమానంలో పడతారు. వారి క్లాసుల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన నెలకొంటుంది.
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లను ఆయా జిల్లాల అధికారులు ప్రకటిస్తారు. ఆ కంటైన్మెంట్ జోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో ప్రకటించాలి. కేంద్రంతో సంప్రదించకుండా కంటైన్మెంట్ జోన్ల బయట ఎలాంటి లాక్ డౌన్ ప్రకటించకూడదు. ఒక రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు, ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలపై ఎలాంటి కండిషన్లు, నిషేధం లేదు. గూడ్స్, వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు కూడా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. రాష్ట్రాలు ఎలాంటి షరతులు విధించకూడదు. ఈ పర్మిట్లు, కొత్త అనుమతులు లాంటివి ఏవీ విధించకూడదు. రైళ్లు, డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించే వారు, వందే భారత్ మిషన్ కింద ఇతర దేశాల నుంచి వచ్చే వారు, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఫ్లైట్స్లో వచ్చే వారు భారత ప్రభుత్వం విధించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి.
65 సంవత్సరాల పైబడిన వారు, గర్భిణులు, 10 ఏళ్ల కంటే చిన్న పిల్లలు ఇళ్లలో ఉండడం శ్రేయస్కరం. అత్యవసరం, ఆరోగ్య కారణాల వల్ల మాత్రమే బయటకు రావడం మంచిది. ఆరోగ్య సేతు యాప్ను తప్పనిసరిగా వినియోగించడం వల్ల కరోనా వైరస్ రిస్క్ నుంచి దూరంగా ఉండవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.