అత్యుత్తమ వైద్యంతో పాటు వైద్య విద్యార్థులకు అవసరమైన మెడికల్ ట్రైనింగ్ ఇస్తున్నాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences-AIIMS). గత కొన్నేళ్లుగా వైద్య విద్యకు డిమాండ్ పెరగడంతో కొత్త ఎయిమ్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఈ సమస్యను తీర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాలోచనలు చేస్తోంది. దేశంలోని అన్ని ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఒక ఉమ్మడి నియామక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఫలితంగా సిబ్బంది నిమాకాలతో పాటు వారి ట్రాన్స్ఫర్స్కు కూడా మార్గం సులభం అవుతుందని ఆరోగ్య శాఖ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా ఏర్పాటైన కొత్త ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంస్థల్లో దాదాపు 44 శాతం వేకెన్సీలు భర్తీ చేయాల్సి ఉందని గతంలో ఆరోగ్య శాఖ లోక్సభలో వెల్లడించింది. 18 కొత్త ఎయిమ్స్లలో 4,026 పోస్టులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో కేవలం 2,259 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. రాజ్కోట్ ఎయిమ్స్లో ఫ్యాకల్టీ కొరత మరింత తీవ్రంగా ఉంది.
186 పోస్టులు మంజూరైతే కేవలం 40 మంది సిబ్బంది మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. గోరఖ్పూర్, విజయ్పూర్ ఎయిమ్స్లలోనూ మంజూరు చేసిన పోస్టులకు, భర్తీ అయిన పోస్టులకు మధ్య తేడా ఎక్కువగా ఉంది. దీంతో అటు వైద్య విద్యార్థులు, ఇటు ప్రజలు పూర్తి స్థాయిలో ఎయిమ్స్ సేవలను పొందలేక పోతున్నారు. ఈ సమస్యపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి : ఐఐటీల్లో సరికొత్త కోర్సు .. కెరీర్ స్కోప్, అర్హత, కోర్సు వివరాలు తెలుసుకోండి!
* కమిటీ నిర్ణయం
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, PMSSY అదనపు సెక్రటరీ, న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్లతో కూడిన కమిటీ జనవరిలో సమావేశమైంది. వివిధ ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీని బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఒక నియామక వ్యవస్థ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించింది.
* ప్రస్తుతం విడివిడిగా
ప్రస్తుతం సిబ్బంది నియామకాన్ని ఆయా ఎయిమ్స్ ప్రతినిధులు స్వతహాగా చేపడుతున్నారు. అయితే, ప్రతిభ గల వైద్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మొగ్గు చూపట్లేదు. ఫలితంగా వీరి సేవలను కొన్ని ఎయిమ్స్ల పరిధిలోని ప్రజలు పొందలేకపోతున్నారని ఒక అధికారి వివరించారు. ఈ సెంట్రల్ రిక్రూట్మెంట్ సిస్టం ద్వారా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీల నియామకం మరింత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు ఫ్యాకల్టీని ఒక ఎయిమ్స్ నుంచి మరొక ఎయిమ్స్కు బదిలీ చేయడం సులువుగా మారుతుందని సదరు అధికారి చెప్పారు.
* నిబంధనల సడలింపు
కొత్తగా ఏర్పాటైన ఎయిమ్స్లలో సిబ్బంది నియామకానికి స్టాండింగ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. ఈ మేరకు కొన్ని నిబంధనలు సడలించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు అర్హత వయసును 50 నుంచి 58 ఏళ్లకు పెంచింది. ఇతర ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యుటేషన్ బేసిస్పై తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
70ఏళ్లకు లోబడి ఉన్న విశ్రాంత ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడానికి మినహాయింపు ఇచ్చింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ కలిగిన వారిని ఫ్యాకల్టీ పోస్టుల్లో నియమించుకోవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ ఎయిమ్స్లలో పనిచేసేందుకు వీలుగా విజిటింగ్ ఫ్యాకల్టీ స్కీమ్ను కూడా రూపొందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Career and Courses, Central Government, JOBS, Latest jobs