యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల (Assistant Professors) ఉద్యోగాల భర్తీకి పీహెచ్డీ చేసిన వారినే గతంలో నియమించేవారు. ఇకపై యూజీసీ (UGC) నిర్వహించే నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధిస్తే సరిపోతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగానికి పీహెచ్డీ చేయాలన్న తప్పనిసరి నిబంధన ఇకపై ఉండదని యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఛైర్మన్ ఎం.జగదీష్కుమార్ వెల్లడించారు. ఈ ప్రకటనపై నెట్ రాసే అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లోని ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) క్యాంపస్లో కొత్తగా UGC- HRDC భవనాన్ని (హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ సెంటర్)ను యూజీసీ చైర్మన్ జగదీష్కుమార్ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలపై మాట్లాడారు. మనకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లకు యూనివర్సిటీ విద్య , పరిశోధనలు పరిష్కారం చూపాలన్నారు. ఈ రంగాల్లో అపారమైన అవకాశాలు లభిస్తాయన్నారు. అందుకు హెచ్ఆర్డీసీ భవనం వేదికగా నిలవాలన్నారు. ఇటువంటి నిర్మాణాలు ఉన్నత విద్యను అభ్యసించేవారికి, వారి అధ్యాపకులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
* డేటా పోర్టల్
ఒకే దేశం.. ఒకే డేటా పోర్టల్ తీసుకొచ్చేలా ప్రయత్నం జరుగుతోందన్నారు. యూజీసీకి సంబంధించిన అన్ని వివరాలు అందులోనే ఉంటాయన్నారు. కన్వెన్షనల్ మోడ్లో విద్యావేత్తలతో పాటు, వచ్చే విద్యా సంవత్సరం నుండి నేషనల్ డిజిటల్ యూనివర్సిటీల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని వివరించారు.
ఇది కూడా చదవండి :నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారో లేదో చెక్ చేయండి!
* నిపుణులకు అవకాశం
‘తెలంగాణ టుడే’ రిపోర్ట్ ప్రకారం.. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ నిబంధన తప్పనిసరి చేయడంతో నైపుణ్యం ఉన్నా పీహెచ్డీ లేని వారు దూరం అవుతున్నారని, అందుకే ఈ నిబంధన తొలగిస్తున్నామని జగదీశ్ కుమార్ చెప్పారు. దీంతో పీహెచ్డీ లేని నిపుణులకు అవకాశం లభించనుంది.
వాస్తవానికి ఈ మార్గదర్శకాలు 2021లోనే రావాల్సి ఉండగా, కొవిడ్-19 కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అమలులోకి వస్తుంది. ఇకపై యూజీసీ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నెట్ పరీక్షను నిర్వహిస్తుంది. అందులో క్వాలిఫై అయ్యి, సాధించిన స్కోర్ ఆధారంగా ఇకపై నియామకాలు చేపడతారు.
* ఏప్రిల్ 10 వరకు సమయం
యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్షిప్ (LS), అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in లో అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పరీక్ష జూన్ 6, 7, 8 తేదీల్లో జరుగుతుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.
* మహిళలకు 50% పోస్టులు
ఇదే కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ విశ్వవిద్యాలయ పురోగతిని వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 50 శాతం మహిళా అధ్యాపకులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Phd, UGC, UGC NET