తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 44 రోజులు మాత్రమే పాఠశాలలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులకు ఒక ఫార్మేటీవ్ అసెస్మెంట్(FA-1) పరీక్షను నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టులో 20 మార్కులకు ఆ పరీక్ష నిర్వహించారు. ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను అధికారులు రూపొందించారు.
గ్రేడ్ ల కేటాయింపు ఇలా..
విద్యార్థులకు గ్రేడ్ల కేటయింపు ఇలా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్ను కేటాయించారు. 81-90 మార్కులు సాధించిన వారికి A2, 71-80 మార్కులకు B1, 61-70 మార్కులు వచ్చిన వారికి B2, 51-60 మార్కులకు C1 గ్రేడ్, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులు సాధించిన వారికి D, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్ను కేటాయించారు. అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.
ఫీజు చెల్లించింది 5,21,392 మంది పాస్..
ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లలో పదో తరగతిలో 5,46,865 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150 నిర్ణయించారు. లేట్ ఫీజు రూ.50 తో మార్చి 16 వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చారు. మార్చి 22 వరకు రూ.500 లేట్ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు అధికారులు. అప్పటివరకు 5,21,392 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. టెన్త్ లో అడ్మిషన్ పొందిన 25,473 మంది విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించకపోవడంతో వారు FA-1 పరీక్షకు హాజరైనా అధికారులు పాస్ చేయలేదు. ఫీజు చెల్లించని వారు ఫెయిల్ అయినట్లేనని అధికారులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.