తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి కొద్ది రోజులుగా సాగుతున్న వివాదం తాజాగా హైకోర్టుకు చేరింది. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు వినియోగిస్తున్న డిజిటల్ మీటర్లలో తప్పుడు ఫలితాల కారణంగా తాము అర్హత కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ అంవంపై రాజేందర్ అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈవెంట్స్ సందర్భంగా వినియోగిస్తున్న ఎత్తు కొలిచే డిజిటల్ మీటర్లలో తప్పులు వస్తున్నాయని ఆ అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఫిజికల్ ఈవెంట్స్లో అభ్యర్థుల ఎత్తు కొలతలకు సంబంధించిన వీడియోను పిటిషన్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
పోలీస్ ఈవెంట్స్ సందర్భంగా ఇటీవల అనేక అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. డిజిటనల్ మీటర్లలో తప్పులు వస్తున్నాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవెంట్స్ లో అర్హత సాధించిన వారు, సెలక్ట్ అయి ఉద్యోగం చేస్తున్న వారు ఇప్పుడు అనర్హత పొందుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అవకతవకలను సరి చేయాలన్న డిమాండ్ చాలా రోజులుగా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టుకు చేరడంతో క్వాలిఫై కాని అభ్యర్థుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందేమోనని అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Police jobs, Telangana police jobs