పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉద్యోగులు నియమిత ఉపచారాలు నిర్వహించుకునేందుకు వీలుగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో సాయంత్రం(Evening) ఒక గంట ముందుగానే విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు(Employees), ఉపాధ్యాయులు(Teachers), ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సాయంత్రం గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పని వేళలు 8 గంటలు ఉంటాయి. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. కానీ ఈ నెల రోజులు ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లవచ్చు.
ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించింది. దీనికి ప్రతీగా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పర్వదినాన్ని రాష్ట్ర పర్వదినంగా అధికారంగా నిర్వహిస్తోంది. రంజాన్ పర్వదినం శాంతికి చిహ్నమని ఇస్లాం మతపెద్దలు చెబుతుంటారు. రంజాన్ పవిత్ర మాసంలో పేదవారికి ఉన్నదాంట్లో దానం చేయాలని పవిత్ర గ్రంథం ఖురాన్ చెబుతోంది. అందుకు అనుగుణంగా ఆ రోజు ముస్లిం సోదరులు తమ స్థాయికి తగినట్లు దాన ధర్మాలు చేస్తుంటారు. అలాగే ప్రభుత్వం కూడా ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు అందించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Muslim brothers