తెలంగాణ (Telangana)లో దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం ఇటీవల అనేక సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ల (Jobs Notification) కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనుకున్నా.. రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్, గ్రూప్స్ పోస్టులకు నోటిఫికేషన్లు వేశారు. అయితే.. సరైన సమాచారం లేక పలు నోటిఫికేషన్ల ప్రకటన వాయిదా పడుతుండటంతో వారిలో నిరాశ వ్యక్తమవుతోంది. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation day) సభలో సీఎం కేసీఆర్ (CM KCR) ఉద్యోగ నోటిఫికేషన్లపై (Jobs Notification) కీలక ప్రకటన చేశారు. ఉద్యోగార్థులు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేలా నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కేసీఆర్ ప్రసంగంలో చెప్పారు. నోటిఫికేషన్, నోటిఫికేషన్ మధ్య కొంత వ్యవధి (Small gap) ఇవ్వాలని చెప్పినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు నోటిఫికేషన్లు (Telangana govt jobs) ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు. అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ (Telangana Formation day) సందర్భంగా గన్పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు.
8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిందని..
అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను.. 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావంకు ముందు.. ఇప్పుడున్న పరిస్థితులకు అసలు పోలికే లేదన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికే దిశ నిర్దేశం చేసే కరదీపికగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరుకుందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం ముందుందని తెలిపారు. తలసరి ఆదాయంలో పెరుగుదలలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు. కరెంట్ కష్టాలకు చరమగీతం పాడి చరిత్రకెక్కామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చేపట్టే ప్రతి చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుందన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. తనతో పాటు ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసినా.. పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని.. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Govt Jobs 2022, Jobs in telangana, Telangana Formation Day