కరోనా కారణంగా కుదేలైన ఐటీ రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. పలు సంస్థలు తమ కార్యకలాపాలను మెరుగుపర్చడం కోసం తాజాగా రిక్రూట్మెంట్ను చేపడుతున్నాయి. అలాగే అట్రిషన్ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్ ముందు వరుసలో ఉన్నాయి. టీసీఎస్ దాదాపు 40వేల నియామకాలను చేపట్టనుంది. మరో సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాది 50వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఇన్ఫోసిస్ అట్రిషన్ (ఉద్యోగ వలసలు) రేట్ 2022 మార్చి క్వార్టర్లో 27.7 శాతానికి పెరగ్గా... డిసెంబర్ 2021 క్వార్టర్లో ఇది 25.5 శాతంగా ఉంది. 2021-22 నాలుగో త్రైమాసికంలో TCS అట్రిషన్ 17.4 శాతంగా నమోదు అయింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు ఇది 7.3 శాతంగా ఉంది. డిసెంబర్ 2021 త్రైమాసికంలో TCS అట్రిషన్ రేట్ 15.3 శాతంగా ఉంది.
గత పన్నెండు నెలల (LTM) ఆధారంగా చూసుకుంటే అట్రిషన్ రేట్ సంఖ్య పెరుగుతుందని TCS మేనేజ్మెంట్ తెలిపింది. అయితే అది తగ్గుతున్న రేటులో పెరుగుతున్నాయని పేర్కొంది. గత త్రైమాసికంలో అట్రిషన్ రేటు వాస్తవానికి తగ్గిందని ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ వెల్లడించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ 2021 ఆర్థిక సంవత్సరంలో నియామకాల విషయాల్లో దాదాపు 61వేల ఉద్యోగులను క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామకాలను ఈ రెండు కంపెనీలు భారీగా చేపట్టనున్నాయి. టీసీఎస్ 1,00,000, ఇన్ఫోసిస్ 85వేల మంది ప్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023)లో మరో 50వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నామని... ఈసారి కూడా కనీసం 50,000 నియామకాలు చేపట్టాలనే యోచనలో ఉన్నామన్నారు.
టీసీఎస్ కూడా ఇన్ఫోసిస్ దారిలోనే నడిచే అవకాశం ఉంది. గతేడాది చేపట్టిన విధంగానే ఈసారి కూడా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 40,000 నియామకాల లక్ష్యంతో కంపెనీ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తోందని.. అవసరమైతే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జి సుబ్రమణ్యం తెలిపారు.
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత పెరిగింది. ఐటీ రంగం కూడా ఈ పద్దతినే అవలంబించాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో పలు ఐటీ సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 25/25 మోడల్ స్వీకరించడానికి కట్టుబడి ఉన్నామని టీసీఎస్ స్పష్టం చేసింది. దీంతో కంపెనీ అసోసియేట్స్ 25 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలో నైనా కార్యాలయం నుండి పని చేయాల్సిన అవసరం ఉండదు. వారు ఆఫీస్లో 25 శాతానికి మించి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు.
TCS అప్పుడప్పుడు ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఆఫీసుల్లో ఉద్యోగుల పనితనం మెరుగుపర్చడానికి ఇది దోహదపడుతుంది. వీటి సహాయంతో ఉద్యోగులు టీసీఎస్ ఎదైనా కార్యాలయం నుంచి పనిచేయడానికి, తోటి టీమ్ మెంబర్స్తో ఇంటరాక్ట్ కావచ్చు. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఆఫీసులకు వచ్చేలా ప్రేరేపిస్తుంది. దీన్ని దశల వారీగా చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.