ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే.. సాధించే వరకు విశ్రమించకూడదు అంటారు. ఈ మాటలు చాలా మంది విన్నా.. కొందరికే అనుసరించే సత్తా ఉంటుంది. ఈ కోవకే చెందుతాడు బిహార్కు (Bihar) చెందిన జైప్రకాష్ సాహ.. మొదటి నుంచి ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు. ఎంతలా అంటే.. అనుకున్నది సాధించే వరకు స్వగ్రామంలో అడుగు పెట్టకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. నాలుగేళ్లగా సొంతూరి ముఖం చూడని జైప్రకాష్.. మూడో ప్రయత్నంలో గోల్ రీచ్ అయ్యాడు. అతని విజయాన్ని కుటుంబమే కాదు.. ఊరు ఊరంతా ఆనందిస్తోంది.
నిరుపేద కుటుంబంలో పుట్టి.. UPSC ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్(ISS) ఎగ్జామ్లో ఆల్ ఇండియా స్థాయిలో 27వ స్థానంలో నిలిచాడు జైప్రయాశ్. అతడు విజయం సాధించిన తీరు.. అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ యువకుడి సక్సెస్ స్టోరీ (Success Story) తెలుసుకోండి.
Success Story : ఒకప్పుడు భారత్ లో బీడీలు చుట్టేవాడు..ఇప్పుడు అమెరికాలో జడ్జి అయ్యాడు
27వ ర్యాంకు సాధించిన జైప్రకాష్
జైప్రకాష్ బీహార్లోని చంపారన్ జిల్లా, మఝౌలియా బ్లాక్లోని జోకాటియా పంచాయతీకి చెందినవాడు. వయస్సు 26 సంవత్సరాలు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా భావించే UPSC ISS పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ISS ఎగ్జామ్లో భారతదేశం నలుమూలల నుంచి మొత్తం 29 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో జై ప్రకాష్ 27వ స్థానం సాధించాడు. రెండేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత, ఏదో ఒక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అగప్పిస్తారని జైప్రకాష్ చెప్పాడు.
ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటూ.. ప్రిపరేషన్
జైప్రకాష్ ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిగింది. 2012లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం పాట్నా సైన్స్ కాలేజీలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏసీ పూర్తి చేశాడు. అప్పటి వరకు తండ్రి సంపాదనపైనే ఆధారపడిన అతను.. MAC డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఒక కంపెనీకి ఫ్రీలాన్సింగ్ చేయడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటూ, చదువును కొనసాగించాడు.
ఒకటే లక్ష్యం
జైప్రకాష్ నుంచి అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అతడు మొదటి నుంచి ఒకే ఒక లక్ష్యంపై దృష్టి పెట్టాడు. మొత్తం మూడుసార్లు ISS ఎగ్జామ్ను రాసి.. చివరి ఎగ్జామ్లో అనుకున్నది సాధించాడు. అయితే అంతకు ముందే, గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాతే స్వగ్రామంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. గత నాలుగేళ్లుగా జైప్రకాష్ సొంతూరిలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు అతని విజయానికి కుటుంబ సభ్యులే కాదు, ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు.
కుటుంబ నేపథ్యం
జైప్రకాష్ తండ్రి కన్హయ్య సాహ, వృత్తిరీత్యా వడ్రంగి. పనుల కోసం ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. చాలా కాలం బయటి ప్రాంతాల్లోనే పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో కూలీగా పనిచేస్తున్నారు. జైప్రకాష్ తల్లి గాయత్రీ దేవి గృహిణి. ఆమె కుటుంబ పోషణకు సాయం చేయడానికి పొలాల్లో మేకలను మేపుతారు. జైప్రకాష్కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారు గ్రామంలోనే ఉండి చదువుకుంటున్నారు. ఆర్థిక భారం పెరుగుతున్నా తండ్రి తన ఆశయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, చివరి వరకు వెన్నుతట్టి ప్రోత్సహించాడని జైప్రకాష్ చెప్పాడు. తన విజయాన్ని తల్లిదండ్రుల శ్రమే కారణమని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Civil Services, JOBS, Success story, UPSC