ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు, పరీక్షకు హాజరైన తరువాత అప్లికేషన్ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న జెండర్ గ్యాప్ను తగ్గించేందుకు, అలాగే రైల్వే సర్వీసుల్లో మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం, భారతీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో మొత్తం ఉపాధిలో మహిళల భాగస్వామ్యం కేవలం 7.87% మాత్రమేనని అంచనా.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)లో మహిళా సిబ్బంది సంఖ్య గత కొన్నేళ్లుగా రైల్వేలోని ఇతర విభాగాలతో పోలిస్తే కొంచెం పెరిగింది. అయితే రైల్వేలో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 3న లోక్సభలో లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాల ప్రకారం.. రైల్వేలోని వివిధ విభాగాల్లో 12,52,347 మంది ఉద్యోగుల్లో కేవలం 98,540 మంది మహిళా ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. మార్చి 2021 నాటికి, భారతీయ రైల్వేలో మొత్తం ఉద్యోగలు 12,52,347 మంది కాగా, అందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 98,540. రైల్వేలో ఉద్యోగాల్లో మహిళల మొత్తం భాగస్వామ్యం కేవలం 7.87 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు.
మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు రైల్వే శాఖ చేపట్టిన చర్యలను వివరిస్తూ.. ‘ఆర్పీఎఫ్లో, 2018కి ముందు మొత్తం సిబ్బందిలో మహిళా సిబ్బంది శాతం దాదాపు 3% ఉండగా, అది ఇప్పుడు గణనీయంగా పెరిగి 9%కి చేరింది. ఈ క్రమంలో మహిళా అభ్యర్థులను ప్రోత్సహించడానికి వారి నుంచి సేకరించిన దరఖాస్తు రుసుమును, పరీక్షకు హాజరైనప్పుడు రైల్వే శాఖ తిరిగి చెల్లిస్తుంది.’ అని మంత్రి వైష్ణవ్ తెలిపారు.
రైల్వేల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, భర్తల నుంచి చట్టబద్ధంగా విడిపోయిన లేదా అవివాహితులైన మహిళల విషయంలో గరిష్ట వయోపరిమితిని రైల్వే పరీక్షలకు 35 సంవత్సరాల వరకు సడలింపు ఉందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా మహిళా అభ్యర్థుల కోసం లెవెల్-I కేటగిరీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) అర్హత విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చారు.
వర్కింగ్ ఏరియాల్లో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాల నుంచి సరైన భద్రత కల్పించాలని జోనల్ రైల్వేను ఆదేశించారు. ప్రస్తుతం మహిళా టీటీఈలు, ఇతర పోస్టులతో పాటు వివిధ జోన్లలలో సుమారు 1500 మంది మహిళా లోకో పైలట్లు పనిచేస్తున్నారు.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రయాణికుడు దిగే స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందు అలర్ట్ చేయడానికి ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ ఫీచర్ను తీసుకొచ్చింది. దీన్ని పొందేందుకు ప్రయాణికులు తొలుత తమ ఫోన్ నుంచి ఐఆర్సీటీసీ నంబర్ 139కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కారణంగా మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందు మీ ఫోన్కు కాల్ రూపంలో అలర్ట్ వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Applications, Indian Railways, JOBS, Railway jobs