ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెరిగిపోవడంతో విద్యావ్యవస్థలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఆన్లైన్ కోర్సుల ద్వారా దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లు చిన్న నగరాల విద్యార్థులకు సైతం చేరువవుతున్నాయి. ఐఐటీ, ఐఐఎంలో చదవడమంటే చాలా మంది విద్యార్థులకు కలలాంటిది. అలాంటివి ఆ టాప్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఐఐటీ, ఐఐఎం, హార్వర్డ్లకు ఇప్పుడున్న విశిష్టమైన పేరే ఉంటుందా.. అదే విధంగా టాప్ ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్ కోర్సుల ద్వారా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో సాధారణ కళాశాలలు నిలదొక్కుకోగలవా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
భారత్లోని టాప్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లు ఫుట్టైమ్ డిగ్రీలను ఆన్లైన్ ద్వారా బోధించవచ్చని 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారి ఐఐటీ మద్రాస్ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి డిగ్రీ కోర్సును గతేడాది ప్రారంభించింది. ఇందులో బీఎస్సీ కోసం దాదాపు 30,276 దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్. దరఖాస్తు చేసిన అభ్యర్థి ఈ డిగ్రీని మూడు నుంచి ఆరు సంవత్సరాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం రావడం లెర్నర్స్కు చాలా ఉపయోగడుతుందని ఐఐటీ మద్రాస్ చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్న కోర్సెరా ఈ విషయంపై స్పందించింది. ఆన్లైన్లో ఫుల్టైమ్ డిగ్రీ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని వెల్లడించింది. రెండేళ్ల ముందు వరకు ఆన్లైన్లో షార్ట్టర్మ్ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉండేంది. అయితే ఇప్పుడు ఫుల్టైమ్ డిగ్రీలు కూడా ఆన్లైన్లో చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.
ఇదివరకే డిగ్రీ పూర్తి చేసిన మరో సబ్జెక్టులో నైపుణ్యం కోసమే ఎక్కువ మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆన్లైన్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారని కొందరు నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఆన్లైన్ విద్య కూడా ప్రధాన అర్హతగా పేరుతెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక టైర్-2 కళాశాల్లో చదివే కంటే ఆన్లైన్లో అత్యుత్తమ కాలేజీ నుంచి డిగ్రీ చేయాలని కూడా ఇప్పటికే కొందరు విద్యార్థులు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు ఆన్లైన్ కోర్సుల వల్ల మహిళలు సైతం ఎక్కువగా చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. క్యాంపస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే మంచి కోర్సులు అందుబాటులోకి వస్తుండడంతో వారు మళ్లీ డిగ్రీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆన్లైన్ డిగ్రీల వల్ల భారత్లోని టాప్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువ మందికి చేరువవుతుంటే.. టైర్-2, టైర్-3 కళాశాలలకు మాత్రం కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్గ్రాడుయేషన్ స్థాయిలో కింది స్థాయి కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య, ప్లేస్మెంట్లు కల్పించలేకపోతున్న కళాశాలలు ఇక ఎంతో కాలం నడవలేవని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టాప్ ఇన్స్టిట్యూట్లు కూడా ఆన్లైన్ లేదా హైబ్రిడ్ డిగ్రీలను తక్కువ ఫీజులకే అందుబాటులోకి తెస్తుండడంతో విద్యార్థులు వీటివైపే మొగ్గు చూపుతారని చెబుతున్నారు.
ఆన్లైన్ అమ్మకాలు, ఈ కామర్స్ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా మారిన విధంగానే ఆన్లైన్ ఎడ్యుకేషన్కు కూడా త్వరలోనే గణనీయంగా డిమాండ్ పెరుగుతుందని గ్రేట్ లెర్నింగ్ ఫ్లాట్ఫామ్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ నాయర్ అభిప్రాయపడ్డారు. నాసికరమైన లోకల్ కళాశాలల ఫీజుల కంటే తక్కువ మొత్తానికే టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఆన్లైన్ డిగ్రీలు చదివే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT, Online Education