Infosys Springboard : విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో గొప్ప ప్రోగ్రామ్తో ముందుకొచ్చింది. స్ప్రింగ్ బోర్డ్ అనే ఉచిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 2025 నాటికి 10 మిలియన్లకు పైగా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ఒక వర్చువల్ ప్లాట్ఫామ్. ఇది విద్యార్థులకు కార్పోరేట్-గ్రేడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. దీనిలో విద్యార్థి ఒక్కసారి ఎన్రోల్ అయితే చాలు 6 వ తరగతి నుంచి జీవితకాలం పాటు నూతన టెక్నాలజీస్పై శిక్షణ అందుకోవచ్చు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీతో వారికి లైవ్ సెషన్స్ ఏర్పాటు చేస్తారు. పాఠశాల, కళాశాల విద్యార్థుల నుంచి ప్రొఫెషనల్స్, పెద్దల వరకు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు ఈ స్ప్రింగ్బోర్డ్లో పాల్గొనవచ్చు. ఇది వారి డిజిటల్ రీకిల్లింగ్ను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది చదవండి...IIT Kharagpur: టాప్ 100 జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు... ప్రత్యేక స్కాలర్షిప్
కోర్సెరా, లెర్న్షిప్ వంటి ప్రపంచ ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సహకారంతో ఈ స్పింగ్బోర్డ్ ప్రోగ్రాంను ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసింది. ఆన్లైన్ కోర్సుల నిర్వహణ, టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఇన్ఫోసిస్కు 4 దశాబ్దాల గొప్ప అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ కోర్సులను నిర్వహిస్తామని తెలిపింది. అంతేకాదు, మాస్టర్ క్లాస్లు, ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్, ప్రాక్టీస్ సెషన్ల ద్వారా ఈ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తామని తెలిపింది. తద్వారా, విద్యార్థులు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అలవడుతుంది. వారు త్వరగా నూతన టెక్నాలజీస్పై పట్టు సాధించగలరు.
ఈ వర్చువల్ క్లాసులు పూర్తయిన తర్వాత ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేషన్ అందజేస్తారు. ఇప్పటికే దాదాపు 4,00,000 మంది లెర్నర్స్, 300 కంటే ఎక్కువ విద్యా సంస్థలు, ఎన్జీఓలు, సహాయక బృందాలు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.
నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా..
ఈ సరికొత్త ప్రోగ్రామ్పై ఇన్ఫోసిస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల ఆరోహి మాట్లాడుతూ "విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలంటే డిజిటల్ పాఠ్యాంశాలు చాలా అవసరం. మా లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే లేటెస్ట్ టెక్నాలజీస్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దగలవు. ఎన్జిఓలు, ఇతర సహాయక బృందాలతో దీన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నాం. నైపుణ్యం గల యువతను తయారు చేయడమే ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం” అని చెప్పారు.
దీనిపై ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాయ్ మాట్లాడుతూ ‘‘అన్ని వర్గాల ప్రజలకు డిజిటల్ లెర్నింగ్ను ఆవశ్యకతను కరోనా మహమ్మారి నొక్కిచెప్పింది. ఇన్ఫోసిస్, దశాబ్దాలుగా, మా స్వంత వర్క్ఫోర్స్, మా క్లయింట్లు, విద్యార్థుల డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇప్పటికే కృషి చేస్తోంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ద్వారా నేటి తరం విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం” అని పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ఆన్లైన్ కోర్సులు ఎలా పని చేస్తాయి?
ఈ ఆన్లైన్ కోర్సులు చేయడం కొత్త టెక్నాలజీస్ను సులభంగా నేర్చుకుంటారు. లేటెస్ట్ టెక్నాలజీస్కు అనుగుణంగా ఈ కోర్సులను డిజైన్ చేశారు. ఇది వారి కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిపుణులతో శిక్షణ ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సులను నేర్చుకోవచ్చు. వారు అధునాతన డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అధిక వేతనం ఇచ్చే ఉద్యోగాల వైపు వెళ్లవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online Education