సాధారణంగానే ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించుకొనేందుకు సమ్మెబాట పడుతుంటారు. యాజమాన్యం, ఉద్యోగుల మధ్య అంగీకారం కుదరని పక్షంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే తాజాగా దిగ్గజ న్యూస్ పబ్లిషర్ న్యూయర్క్ టైమ్స్ ఉద్యోగులు సమ్మె చేశారు. జీతాలు పెంచాలని కోరుతూ గురువారం 1100 మంది పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దాదాపు 24 గంటల పాటు ఈ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న న్యూయార్క్ టైమ్స్లో ఉద్యోగులు సమ్మె చేయడం ఇదే మొదటిసారి.
సమ్మె కారణాలు
న్యూయార్క్ టైమ్స్లోని న్యూస్రూమ్ ఉద్యోగులు, న్యూస్గిల్డ్ సభ్యులు తమ జీతాలకు సంబంధించిన చివరి ఒప్పందం 2021 మార్చిలో ముగిసిపోయింది. అప్పటి నుంచి జీతాల పెంపుపై యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. రెండేళ్లు కావొస్తున్నా.. జీతాల విషయం ఓ కొలిక్కి రాలేదు. దీంతో విసిగిపోయిన ఉద్యోగులు నేడు (డిసెంబర్ 8)న సమ్మె బాట పట్టారు. ఇండియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మె కొనసాగనుంది. ఈ 24 గంటల సమ్మెలో దాదాపు 1100 మందిపైగా ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా 24 గంటల పాటు సమ్మె చేస్తామని ఉద్యోగుల యూనియన్ గత వారమే ప్రకటించింది.
ఉద్యోగుల స్పందన
ఉద్యోగుల సమ్మెపై న్యూయార్క్ టైమ్స్ చెందిన ఓ రిపోర్టర్ ట్వీట్ చేశారు. ఈ రాత్రి న్యూయార్స్ టైమ్స్తో ఉద్యోగులు చేసిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా నేను విధులు బహిష్కరిస్తున్నామని, తనతోపాటు 1,000 మందికి పైగా ఈ అర్ధరాత్రి నుంచి 24 గంటల వాక్-అవుట్లో ఉంటామని పేర్కొన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. గత మంగళవారం, బుధవారం కూడా ఉద్యోగులు, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. అయితే వేతనాల పెంపు, రిమోట్-వర్క్ విధానాలు వంటి సమస్యలపై చర్చలు విఫలమయ్యాయని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
10 శాతం పెంపునకు డిమాండ్
న్యూయార్క్ టైమ్స్ ఫైనాన్స్ రిపోర్టర్, ఉద్యోగుల యూనియన్ ప్రతినిధి స్టేసీ కౌలీ మాట్లాడుతూ.. ర్యాటిఫికేషన్ వద్ద 10 శాతం వేతనాల పెంపును కోరుతున్నామని.. అలాగే గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న జీతాల పెంపును కూడా భర్తీ చేసి వేతనాలను పెంచాలని కోరారు. ఉద్యోగులు తమ ఉద్యోగాలను చేయడానికి.. కొంత సమయం రిమోట్ వర్కింగ్ విధానానికి అనుమతి ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. అయితే ఫుల్టైమ్ ఆఫీస్కు రావాలని యాజమాన్యం సూచించిందని స్టేసీ కౌలీ పేర్కొన్నారు.
అంతరాయంలేని సేవలకు సిద్ధం
ఉద్యోగుల సమ్మెపై న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం స్పందించింది. సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. న్యూస్గిల్డ్ సమ్మెకు దిగడంతో నిరాశలో ఉన్నామన్నారు. అయితే తమ పాఠకులకు అంతరాయం లేకుండా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.