దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షగా నీట్ (NEET 2022) ను నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఇది ఒకటి. ఈ ఏడాది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- యూజీ (NEET- UG) ను జూలై -17న నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూన్ 15 వరకు జరగనున్నాయి. దీంతో నీట్ కోసం ప్రిపేర్ కావడానికి సమయం తక్కువగా ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు. కాబట్టి నీట్ను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా జాతీయస్థాయిలో జరిగే అనేక ప్రవేశ పరీక్షలు క్లాష్ అవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. నీట్-2022తో పాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కోసం కూడా దరఖాస్తు చేసుకునే వారికి ప్రిపరేషన్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. CUET 2022 జూలై మొదటి లేదా రెండో వారంలో జరుగుతుంది. దీంతో మెడికల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ కావడానికి కొన్ని రోజుల సమయం ఉండడంతో తమపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ కారణంగానే జేఈఈ మెయిన్ వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులు హైలైట్ చేస్తున్నారు. నీట్ వాయిదా కోసం విద్యార్థులు అనేక మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ ప్రయత్నాలు ఏవో చూద్దాం.
ఎన్టీఏ(NTA)కు లేఖ
పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థకు, నీట్ వాయిదా కోరుతూ 10వేల మందికి పైగా MBBS అభ్యర్థులు లేఖ రాశారు. నీట్ పరీక్ష తేదీ, ఇతర పోటీ పరీక్షలకు చాలా దగ్గరగా ఉందని లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. CUET జూలై మొదటి లేదా రెండో వారంలో, JEE మెయిన్స్ రెండో అటెమ్ట్ పరీక్ష జూలై 21 నుండి ప్రారంభం కానుంది. అయితే నీట్ కూడా ఇదే తేదీల మధ్య ( జూలై 17) నిర్వహించడం తమకు చాలా భారం అవుతుందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు.
ఆన్లైన్ పిటిషన్
ఎన్టీఏకు లేఖ రాయడానికి ముందు, విద్యార్థుల్లో కొంత మంది నీట్ను వాయిదా వేయాలని కోరుతూ ఆన్లైన్ పిటిషన్ను ప్రారంభించారు. తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షకు సిద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉంది. దీంతో విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆన్లైన్ పిటిషన్లో విద్యార్థులు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
నీట్ పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర విద్యాశాఖకు లేఖలు రాశారు. విద్యార్థుల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ను వాయిదా వేయాలని లేఖ ద్వారా కోరారు.
NEET -2022 పరీక్ష విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి నిబంధనను తొలగించారు. దీంతో ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా పోటీ మరింత తీవ్రం కానుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అదనంగా 20 నిమిషాల సమయం కేటాయించనున్నారు. దీంతో మొత్తంగా 3 గంటల 20 నిమిషాల పాటు నీట్ పరీక్ష జరగనుంది. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉండనుంది. కొత్త మార్కింగ్ విధానం ప్రకారం పత్రి తప్పు సమాధానికి ఒక మార్క్ను తీసివేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, NEET 2022