మెడికల్ విద్యార్థులు (Medical Students) రకరకాల కారణాలతో విదేశాల్లో మెడికల్ పీజీ డిగ్రీ (Medical PG Degrees)లను పూర్తి చేస్తుంటారు. అయితే ఫారిన్ వెళ్లాలనుకునే భారతీయ వైద్య విద్యార్థులు ఒక విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఐదు దేశాల్లో పూర్తి చేసిన మెడికల్ పీజీ డిగ్రీలకే ఇండియాలో గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) స్పష్టం చేసింది. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఐదు దేశాల్లో రెగ్యులర్ మోడ్లో కంప్లీట్ చేసిన మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి మాత్రమే భారతదేశంలో గుర్తింపు ఉంటుందని ఎన్ఎంసీ వెల్లడించింది. ఇక్కడ పూర్తిచేసిన పీజీ డిగ్రీలు భారతదేశంలోని మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సమానమని ఎన్ఎంసీ తెలిపింది. ఈ దేశాల్లో పీజీ మెడికల్ డిగ్రీ కోర్సు పూర్తి చేసినవారికి భారత్లో చికిత్సా, బోధనా రంగాల్లో కొనసాగేందుకు అర్హత ఉంటుంది. మెడికల్ టీచర్ల నియామక నిబంధనలపై జారీచేసిన ఉత్తర్వుల్లో ఎన్ఎంసీ ఈ విషయాన్ని పేర్కొంది.
మెడికల్ స్టూడెంట్స్ ఈ దేశాలలోని ఏదైనా దేశంలో కోర్సు పూర్తి చేసి.. అదే దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఇండియాలో ఆ డిగ్రీకి గుర్తింపు లభిస్తుంది. లేనిపక్షంలో విద్యార్థులు పూర్తి చేసిన మెడికల్ డిగ్రీకి ఎలాంటి విలువ ఉండదు. కోర్సు కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి అనుమతి పొందిన వారే ఇండియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగం పొందడానికి అర్హత సాధిస్తారని ఎన్ఎంసీ పేర్కొంది. ప్రమోషన్లు ఇచ్చే విషయంలో కూడా ఈ డిగ్రీలను పరిగణించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మాతృభాష కాని దేశాల్లో అభ్యసించే కోర్సులకు ఎన్ఎంసీ గుర్తింపు లభించదు. అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న జపాన్, జర్మనీ వంటి దేశాల్లో డిగ్రీ కోర్సు చేసినా వాటిని ఎన్ఎంసీ గుర్తించదు.
భారత్లోని మెడికల్ కాలేజీల సహకారంతో ఫారిన్ యూనివర్సిటీలు నిర్వహించే ఆన్లైన్ కోర్సులకు కూడా గుర్తింపు లభించదు. ఈ యూనివర్సిటీలు కొన్ని కోర్సులకు ఇండియాలో పరీక్షలను కండక్ట్ చేస్తాయి. మరికొన్ని ఇతర దేశాల్లో ఎగ్జామ్ ని నిర్వహిస్తాయి. ఎక్కడ పరీక్షలను నిర్వహించినా ఈ కోర్సులకు మాత్రం గుర్తింపు లభించిందని వైద్య విద్యార్థులు గమనించాలి. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎన్ఎంసీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా స్థానికంగా ప్రాక్టీస్ చేయవచ్చు. భవిష్యత్తులో ఎక్కువమంది ఇండియన్ డాక్టర్లు ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చి వైద్య సేవలు అందించేలా ప్రోత్సహించేందుకు హెల్త్ మినిస్ట్రీ కొంతకాలంగా ప్లాన్ చేస్తోంది. కేవలం క్వాలిటీ కోర్సులను పూర్తి చేసిన డాక్టర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ కల్పించేలా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో పైన పేర్కొన్న ఐదు దేశాలలో పీజీ డిగ్రీ చేసిన వారికి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్కి టీచింగ్ చేయడానికి ఎలాంటి అనుమతి ఉండకపోయేది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Doctors, JOBS, Medical study