దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (JEE)ని నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్-2023 సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అలా జరగలేదు. పలు రిపోర్ట్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిన తరువాత అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in ద్వారా మార్చి 7లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 6 నుంచి 12 వరకు పరీక్షలు
పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ముందుగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ మధ్య జరగనున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో, సెషన్ -2 పరీక్షలు వాయిదా పడుతుందా అనే విషయంపై స్పష్టత లేదు.
అర్హత ప్రమాణాలు
ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా అందుకు సమానమైన కోర్సుల్లో పాసైన అభ్యర్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు JEE మెయిన్ 2023లో వారి స్కోర్ ఆధారంగా IIIT, NIT, కేంద్రీయ నిధులతో కూడిన సాంకేతిక సంస్థలు (CFTIs)లో అడ్మిషన్స్ పొందేందుకు అర్హులు.
అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక పోర్టల్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి, జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ అనే లింక్పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. ఆ తరువాత అప్లికేషన్ను క్రాస్-చెక్ చేసుకొని, ఫీజు చెల్లించండి. చివరగా భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.
మార్చి చివరిలో అడ్మిట్ కార్డ్స్
జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డ్ మార్చి చివరి వారంలో ఎన్ టీఏ విడుదల చేయనుంది. ఇక పరీక్ష.... ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
జూన్ 4న ఐఐటీ ప్రవేశ పరీక్ష
జేఈఈ మెయిన్లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పరీక్ష జూన్ 4న జరగనుంది.
20 మంది అభ్యర్థులకు 100 పర్సంటైల్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 6న జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను వెల్లడి చేసింది. 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. JEE మెయిన్ 2023 సెషన్ 1 కోసం 8.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 8,23,967 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JEE Main 2023, JOBS