ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). 2022 విద్యా సంవత్సరానికి గాను మొత్తం నాలుగు సెషన్లకు బదులు కేవలం రెండు సెషన్లలో మాత్రమే పరీక్ష(Exam) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా జేఈఈ పరీక్షలను ఏటా ఒకసారి మాత్రమే నిర్వహించేవారు. అయితే, 2019లో సెషన్ల సంఖ్యను రెండుకు పెంచగా.. కరోనా కారణంగా 2021లో ఈ సంఖ్యను నాలుగుకి సడలించారు. అంటే, విద్యార్థులు నాలుగు ప్రయత్నాల్లో సాధించిన ఉత్తమ స్కోరునే ఫైనల్ స్కోర్గా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో క్లాసులు యథావిథిగా కొనసాగుతున్నాయి.
తద్వారా, గతంలో మాదిరిగా 2 సెషన్ల విధానంలోనే పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. గతేడాది కోవిడ్–19 కారణంగా 4 ప్రయత్నాలకు అవకాశం కల్పించామని, ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గినందున రెండు సార్లు మాత్రమే నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు. ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదల..
అయితే విద్యార్థులు మాత్రం గతేడాది మాదిరిగా నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జేఈఈ మెయిన్ 2022లో నాలుగు ప్రయత్నాలను కోరుతూ విద్యార్థులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. అంతేకాదు, జేఈఈకి హాజరయ్యేందుకు 75 శాతం మార్కుల ప్రమాణాలను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖను కోరుతున్నారు. బోర్డు పరీక్షలకు అర్హత సాధించాలంటే విద్యార్థులు 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు పొందాలి.
Stanford University: ఫ్రీ ఆన్లైన్ మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రారంభించిన యూనివర్సిటీ.. వివరాలిలా..
అయితే, 2020, 2021లో ఈ నిబంధనను సడలించారు. ఇంటర్లో 75 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సారి కూడా ఈ వెసులుబాటు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
కాగా, ఇంజినీరింగ్ అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2022 నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ -నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ కూడా jeemain.nta.nic.in లేదా nta.ac.inలో త్వరలో ప్రారంభమవుతుంది. అయితే, పరీక్షలను మాత్రం సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ తర్వాతే నిర్వహిస్తారు. సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, Education CBSE, Exams