కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఐటీ రంగం మునుపటి కంటే వేగవంతమైన వృద్ది సాధిస్తోంది. భారత్లో మునుపెన్నడూ లేనంతగా ఐటీ రంగంలో భారీ నియామకాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో వచ్చే మూడు నెలల్లో 60 శాతం నియామకాలు పెరగనున్నాయని మ్యాన్పవర్గ్రూప్ నిర్వహించిన సర్వేలో తేలింది. 2022 జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఐటీ కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయిని సర్వే తేల్చి చెప్పింది. ఐటీ నియామకాల జోరుతో భారతీయ జాబ్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో గొప్ప వృద్దిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
సర్వే ప్రకారం, భారతదేశంలోని దాదాపు 49 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల్లో భారీగా కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత భారీ ఎత్తున ప్రాజెక్ట్లు రావడమే ఇందుకు కారణం. దీంతో భారత ఐటీ నియామకాల వృద్ధి 2014 నుంచి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోనుంది. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం, నియామకాల వృద్ధి గత త్రైమాసికంతో పోల్చితే ఐదు శాతం పాయింట్లు మెరుగుపడింది.
సర్వేలో బయటపడ్డ కీలక అంశాలేంటి?
మ్యాన్పవర్గ్రూప్ సర్వేలో పాల్గొన్న 3,020 కంపెనీల్లో 64 శాతం కంపెనీలు రాబోయే మూడు నెలల్లో మరింత మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి. కేవలం 15 శాతం కంపెనీలు మాత్రమే తమ సిబ్బందిని తగ్గించుకుంటామని చెప్పగా, మరో 20 శాతం కంపెనీలు యథాతథ స్థితిని కొనసాగించాలని భావిస్తున్నాయి. కేవలం 1 శాతం కంపెనీలు మాత్రం నియామకాలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు.
‘‘కరోనా తర్వాత మార్కెట్లోకి మనీ ఫ్లో పెరగడం, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడం, ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల కారణంగా భారత ఆర్థిక రంగం తిరిగి వేగంగా పుంజుకోగలిగింది. ఈ కారణంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో నియామకాల జోరు పెరిగింది.’’ అని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి అన్నారు.
ఏ రంగంలో ఎక్కువ నియామకాలు?
మ్యాన్పవర్గ్రూప్ సర్వే ఫలితాల ప్రకారం, మల్టీ నేషనల్ కంపెనీలు నియామకాల విషయంలో అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నాయి. 51 శాతం కంపెనీలు వచ్చే జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. ఇది చిన్న కంపెనీలతో పోలిస్తే రెండింతలు ఎక్కువ. ఐటి అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ టెలికాం, మీడియా రంగాలతో సహా పదకొండు రంగాలపై సర్వే చేయగా.. వాటిలో ఐదు రంగాలు 60 శాతం నియామకాలు జరపనున్నట్లు తెలిపాయి. అయితే, రెస్టారెంట్, హోటల్స్ రంగం, ప్రొడక్షన్, కన్స్ట్రక్షన్ రంగాల్లో మాత్రం నియామకాలు జోరు ఆశించినంతగా లేదని సర్వేలో తేలింది.
సీనియర్ ఇంజనీర్ల జీతాల్లో 70 శాతం వృద్ధి
ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఇండీప్ నివేదిక ప్రకారం, ఐటీ నిపుణులకు డిమాండ్ 400 శాతం వరకు పెరిగింది. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అనేక కంపెనీలు 70 నుంచి 120 శాతం జీతాల పెంపును ఆఫర్ చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఫిన్టెక్ కంపెనీ భారత్పే తన కంపెనీలో చేరిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా బిఎమ్డబ్ల్యూ బైక్లను ఇస్తామని ప్రకటించింది. హెచ్సీఎల్ కంపెనీ తన ఉద్యోగులకు బహుమతులు, బోనస్లు అందజేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: It, It telecom, JOBS