లేటెస్ట్ టెక్నాలజీ(Latest Technology)లలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఈ విద్యా సంవత్సరంలో కొత్త బీటెక్ ప్రోగ్రామ్లను ప్రారంభిస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ల(Jee Advanced score) ఆధారంగా ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు(Admissions) కల్పిస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్(Hyderabad)ఈ ఏడాది నుంచి బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ & ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లను ప్రారంభించింది. అయితే ఒక్కో కోర్సులో కేవలం10 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా సీట్ల సంఖ్యను పెంచనుంది.
ఈ కొత్త కోర్సులపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ “కంపెనీలు నూతన టెక్నాలజీస్పై పనిచేస్తున్నాయి. అందుకే, ఉద్యోగానికి అవసరమయ్యే కోర్సులు నేర్చుకున్న వారికే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన రెండేళ్ల నుంచి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడంలో ఇది మా తొలి ప్రయత్నం. ఇప్పటి వరకు ఐటీ కోర్సులకు దృష్టి సారించగా.. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫార్మా కంపెనీలు, పాలిమర్ పరిశ్రమలకు సంబంధించిన కోర్సులపై దృష్టి పెట్టాం” అని చెప్పారు. ఇదే వేగంతో 2023 నాటికి సిస్టమ్స్ ఇంజనీరింగ్, టెక్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో బిటెక్ ప్రోగ్రామ్లను ప్రారంభించాలని ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కొత్త టెక్నాలజీలపై కోర్సుల డిజైన్..
కేవలం ఐఐటీ హైదరాబాద్ మాత్రమే కాకుండా ఐఐటీ గౌహతి, ఐఐటీ పాట్నా ఇటీవలే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్ కోర్సులను ప్రారంభించాయి. ఐఐటీ కాన్పూర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS)ను కూడా ప్రారంభించింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి సైన్స్ కోర్సులను, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DSAI)లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రోగ్రామ్లు రూపొందించాయి.
ఐఐటీ గౌహతిలో ఏఐ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా ఉన్న ప్రొఫెసర్ రత్నజిత్ భట్టాచార్జీ మాట్లాడుతూ “మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కొత్త ప్రోగ్రామ్లను ప్రారంభిస్తున్నాం. కోర్ కోర్సులకు క్రమంగా డిమాండ్ తగ్గుతోంది. అందుకే జేఈఈ టాప్ ర్యాంకర్లంతా కంప్యూటర్ సైన్స్ను మొదటి ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. ఐటీ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాం” అని పేర్కొన్నారు. మరోవైపు, ఐఐటీ ఢిల్లీ కూడా 40 సీట్లతో ఎనర్జీ ఇంజనీరింగ్లో కొత్త బీటెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering course, JOBS, New course