బ్రిటీష్ పాలన కాలంలో భారతదేశంలో పురుడుపోసుకున్న మొదటి ఇంజనీరింగ్ కళాశాలగా (Engineering College) పేరొందిన ఐఐటీ రూర్కీ (IIT Roorkee).. మరో రికార్డును తన పేరుతో లిఖించుకుంది. 1847లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ (Educational Institute), గురువారంతో 175 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఐఐటీ రూర్కీ రెండు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా 1.3 పెటాఫ్లాప్స్ (1.3 PetaFLOPS) సూపర్కంప్యూటింగ్ ఫెసిలిటీ, SCADA-బేస్డ్ స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్.. వంటి రెండు ప్రాజెక్టులను సంస్థ ప్రారంభించింది. ఎనర్జీ అసెంట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్, వాటర్, వేస్టేజ్ వంటి సిస్టమ్స్ కోసం సమగ్ర పర్యవేక్షణ విశ్లేషణలు, నియంత్రణలకు ఈ ప్రాజెక్టులు తోడ్పాటును అందించనున్నాయి.
తన పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించే ఏర్పాట్లు చేస్తోంది ఐఐటీ రూర్కీ. సంస్థ ప్రస్థానం గురించి తెలుసుకోవడంతో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి IIT రూర్కీని సందర్శించాలని పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించింది. భవిష్యత్తు విద్యా విధానం, కెరీర్ ఆప్షన్ల గురించి తెలుసుకునేలా విద్యార్థులకు ఐఐటీ రూర్కీ అధికారులు అవగాహన కల్పించనున్నారు.
IT Jobs: ఐటీ రంగంలో కొలువుల జాతర.. వచ్చే ఏడాది భారత్లో 4.5 లక్షల ఉద్యోగాలు.. వివరాలివే
ర్యాంకింగ్లో పైకి..
IIT రూర్కీ పరిశోధన, ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా ఉండటంతో పాటు సమాజం, దేశ శ్రేయస్సు కోసం మెరుగైన విద్య-పరిశ్రమ సంబంధాన్ని పెంపొందించిందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాజా ప్రకటించిన NIRF ర్యాంకింగ్లో IIT రూర్కీ తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరుకొని, ర్యాంక్ను మెరుగుపరుచుకుందని చెప్పారు. ఆర్కిటెక్చర్ విభాగంలో ఈ ఏడాది ఐఐటీ రూర్కీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.
IIT రూర్కీ డైరెక్టర్ అజిత్ చతుర్వేది మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్లో ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థలకు తమ సంస్థ తోడ్పాటును అందిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్లలో.. రూర్కీకి 200 కి.మీ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూట్లకు నాలెడ్జి క్రియేషన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) సంబంధిత కార్యకలాపాల కోసం సాయం చేస్తామని చెప్పారు. ‘ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యాలను పెంచుతాయి. తద్వారా ఎన్ఆర్ఎఫ్ పథకం (NRF scheme) కింద మరిన్ని నిధులను ఇలాంటి ఉన్నత విద్యాసంస్థలు (HEIs) పొందే అవకాశం లభిస్తుంది’ అని అజిత్ వివరించారు.
ప్రస్థానం ఇదే..
గతంలో ఈ విద్యాసంస్థను ‘రూర్కీ కాలేజ్’గా పిలిచేవారు. దీన్ని 1847లో బ్రిటిష్ సామ్రాజ్యంలో మొదటి ఇంజనీరింగ్ కళాశాలగా స్థాపించారు. 1949 నవంబర్లో స్వతంత్ర భారతదేశంలోని మొదటి ఇంజినీరింగ్ యూనివర్సిటీగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు బిల్లు ద్వారా 2001, సెప్టెంబరు 21న ఈ యూనివర్సిటీని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రభుత్వం గుర్తించింది. ఈ బిల్లుతోనే విద్యాసంస్థ పేరును యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- రూర్కీ’ గా మార్చి, హోదాను పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.