ఐఐటీ మద్రాస్ గత ఏడాది ఆన్లైన్ డేటా సైన్స్ ప్రోగ్రాంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కోర్సు తదుపరి బ్యాచ్ కోసం సంస్థ తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. పదో తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివి.. 12వ తరగతి పూర్తి చేసిన వారిని ఒక డేటా సైంటిస్ట్గా తయారు చేయడమే లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసింది. ఈ కోర్సుకు ఉన్నత విద్య అర్హతతో పనిలేదు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. విద్యార్థులు, బ్యాంకర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, సీఈవోలు.. ఇలా ఎవరైనా కోర్సు నేర్చుకోవచ్చు. మొదటి బ్యాచ్లో 70 మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులు, డైరెక్టర్లు, కంపెనీల వైస్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇస్రో, సీఎస్ఐఆర్ సిబ్బంది వంటి వారు పాల్గొనడం విశేషం. తదుపరి క్వాలిఫయర్ బ్యాచ్కు సంబంధించిన క్లాసులు సెప్టెంబరులో ప్రారంభమవుతాయి.
కోర్సు ప్రత్యేకత ఏంటి?
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) రాయకుండానే.. ఐఐటీ మద్రాస్ సంస్థ నుంచి చదువుకోవడానికి ఈ కోర్సు అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు ఆన్-క్యాంపస్ కోర్సులతో పాటు డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సును అభ్యసించవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) లక్ష్యాలకు అనుగుణంగా ఈ కోర్సును డిజైన్ చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన క్యాంపస్ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని ఐఐటీ మద్రాస్ కల్పిస్తోంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి క్వాలిఫైయర్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నాలుగు వారాల పాటు వీడియో లెక్చర్స్, అసైన్మెంట్లు, కోర్సు ఇన్స్ట్రక్టర్లతో లైవ్ ఇంటరాక్షన్ సెషన్లు నిర్వహిస్తారు. ఆన్లైన్ అసైన్మెంట్లు పూర్తయిన తర్వాత, విద్యార్థులు క్వాలిఫయర్ పరీక్షకు హాజరవ్వాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫౌండేషన్ లెవల్కు ప్రవేశం లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు https://onlinedegree.iitm.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ తదుపరి బ్యాచ్ కోసం దరఖాస్తు చేయడానికి ఆగస్టు 30 వరకు గడువు ఉంది.
వెనుకబడిన వర్గాల వారికి కోర్సు ఫీజులో 75 శాతం వరకు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఏ దశలోనైనా కోర్సు నుంచి నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత కూడా IIT మద్రాస్ నుంచి సర్టిఫికేట్, డిప్లొమా లేదా డిగ్రీని అభ్యర్థులు స్వీకరించవచ్చు. అర్హత ప్రక్రియను క్లియర్ చేసిన తర్వాత మొత్తం 7,116 మంది ఫస్ట్ బ్యాచ్ ఫౌండేషన్ లెవల్లో చేరారు. రెగ్యులర్ ఎంట్రీ ద్వారా ఫౌండేషన్ లెవల్ను పూర్తి చేసిన వారు.. ఆ తర్వాత డిప్లొమా లెవల్లో చేరవచ్చు. వీరు ప్రోగ్రామింగ్లో డిప్లొమా లేదా డేటా సైన్స్లో డిప్లొమా లేదా రెండూ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT Madras