కరోనా కారణంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థలు సైతం ఆన్లైన్ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా గ్రామీణ విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యాభోధన అందిస్తున్నాయి. తాజాగా, ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ బిఎస్సి డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరానుకునేవారు ముందుగా క్వాలిఫయర్ ఎగ్జామ్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్ అన్ని గ్రూపుల వారు ఈ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా లభిస్తుంది. 2021 జూన్ 30 నుంచి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్కు తరగతులు ప్రారంభమవుతాయని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.
ఇక, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రాసెస్ను పరిశీలిస్తే.. ఇంగ్లిష్, మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్, కంప్యూటేషనల్ థింకింగ్ విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఓబీసీలు 35శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. ఈ క్వాలిఫయర్ పరీక్షను 4 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి గంట వ్యవధి ఉంటుంది. అర్హత సాధించిన వారిని ఫౌండేషన్ లెవెల్ కోర్సులోకి అనుమతిస్తారు. క్వాలిఫయర్ ఎగ్జామ్లో సాధించిన స్కోర్ను బట్టి ఎన్ని కోర్సులు నేర్చుకోవచ్చనేది నిర్ణయిస్తారు. 50 శాతం స్కోరు సాధించిన వారికి రెండు, 70 శాతం సాధించిన వారికి మూడు, 70 శాతంపైన సాధిస్తే నాలుగు కోర్లుల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది.
జేఈఈ పరీక్ష లేకుండానే..
“డేటా సైంటిస్ట్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఐఐటీ మద్రాస్ సర్టిఫికేట్ అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ మీ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో డేటా సైంటిస్ట్గా అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రోగ్రామర్, డేటా సైంటిస్ట్ అవ్వాలనుకునే విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం.” అని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ తెలిపారు.
కాగా, ఐఐటిల్లో చదవాలనేది చాలా మంది విద్యార్థులకు డ్రీమ్. అయితే, జేఈఈ వంటి కఠినమైన ఎంట్రన్స్ టెస్ట్లను చేధించలేక విఫలవుతుంటారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును డిజైన్ చేసినట్లు ప్రొఫెసర్ తంగరాజ్ పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ యుజి ప్రోగ్రామ్ను ఫౌండేషన్ ప్రోగ్రామ్, డిప్లొమా ప్రోగ్రామ్, డిగ్రీ ప్రోగ్రామ్ అనే మూడు వేర్వేరు దశల్లో అందిస్తారు. విద్యార్థులు ఏ దశలోనైనా ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించి, ఐఐటి మద్రాస్ నుండి సర్టిఫికేట్, డిప్లొమా లేదా డిగ్రీని సర్టిఫికెట్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.