ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా జర్నలిజం డిగ్రీల్లోనూ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఈ కాలంలో డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎక్కువగా అవకాశాలు లభిస్తుండటంతో జర్నలిజంపై(Journalism) ఇంట్రస్ట్ ఉన్న వారంతా ఎక్కువగా వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టకుని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) మాస్టర్స్ లో(Masters) కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. 2023 జనవరి 6న జరిగిన కార్యక్రమంలో ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఈ మూడు ప్రోగ్రామ్లను ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్లు వివిధ ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఓపెన్(Open), డిస్టెన్స్(Distance) విధానంలో అమలవుతాయని తెలిపారు.
ఆ కోర్సులు ఏంటంటే?
ఎంఏ ఇన్ డెవలప్మెంట్ జర్నలిజం(MA in Development Journalism), ఎంఏ జర్నలిజం అండ్ ఎలక్ట్రానిక్ మీడియా(MA in Journalism and Electronic Media), ఎంఏ జర్నలిజం అండ్ డిజిటల్ మీడియా అండ్ పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ కోర్సులను ఇగ్నో కొత్తగా అందిస్తోంది. ఈ కోర్సుల్లో ప్రస్తుత అకడమిక్ సెషన్ 2023 జనవరి నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రావు మాట్లాడుతూ.. జర్నలిజంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ మాస్టర్స్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ ప్రోగ్రామ్లను స్కూల్ ఆఫ్ జర్నలిజం, న్యూ మీడియా స్టడీస్ సహకారంతో అందజేస్తున్నట్లు తెలిపారు. జర్నలిజంలో నైపుణ్యాలు సాధించాలనే విద్యార్థులకు ఇవి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. డిస్టెన్స్, ఓపెన్ విధానంలో ఈ కోర్సులు చేయవచ్చని అన్నారు. అవసరం అనుకుంటే మధ్యలోనే నిష్క్రమించేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. తద్వారా విద్యార్థులు వారి ప్రయారిటీస్ ఆధారంగా విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎప్పటి నుంచో జనరిక్ మాస్టర్స్ ప్రోగ్రాం
తమ యూనివర్సిటీలో ఇప్పటికే అందరికీ సరిపోయేలా జనిరిక్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అమలులో ఉన్నాయని రావు తెలిపారు. దీన్ని కూడా ఓపెన్, డిస్టెన్స్, ఆన్లైన్ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక జెనరిక్ ప్రోగ్రామ్ ఇంగ్లీషు, హిందీ, తమిళం భాషలలో ప్రస్తుతం అందుబాటులో ఉందని వివరించారు. దీనితో పాటుగా ఇప్పుడు కొత్తగా మరో మూడు కోర్సులను ప్రారంభించామన్నారు.
వర్సిటీని అభినందించిన ప్రముఖులు
నూతన ప్రోగ్రామ్స్ ప్రారంభం కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అరుళ్ సెల్వన్ స్వాగతోపన్యాసం చేశారు. పాఠశాలలోని ఇతర అధ్యాపకులు నూతనంగా ప్రారంభించిన ప్రోగ్రామ్స్ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆజ్ తక్ మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కమర్ వహీద్ నఖ్వీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జేఎస్ యాదవ్, నూయెజ్ ఎడిటర్ అలోక్ వర్మ, ప్రొఫెసర్ జైశ్రీ జెహ్వానీ, ఆసియా పసిఫిక్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అడ్వైజర్ డాక్టర్ దీపక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు విశ్వవిద్యాలయాన్ని అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, JOBS, NewsIGNOU